Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్‌ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌

Ashwini Vaishnaw: ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్‌ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు.

Updated : 19 Mar 2024 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో బుల్లెట్‌ రైలు (Bullet Train) ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందన్నారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు.

‘‘బుల్లెట్‌ రైలు కోసం 500కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్‌ 8-10 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తిచేయనుంది. అది కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. మొదట గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు దీనిని నడపనున్నాం. 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’’ అని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

‘అవును కెటమిన్‌ తీసుకున్నా’.. డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్‌-ముంబయి మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు.

డిసెంబరు నాటికి చిప్‌..

ఈ ఏడాది డిసెంబరు నాటికి తొలి మేడిన్‌ ఇండియా చిప్‌ (Chip) తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘వికసిత్‌ భారత్‌కు ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం చాలా కీలకమైనది. రానున్న ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో టాప్‌-5 దేశాల్లో భారత్‌ నిలుస్తుందని మేం విశ్వాసంగా ఉన్నాం. అమెరికా చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీతో ఒప్పందం జరిగింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి మన దేశంలోని ఈ ప్లాంట్‌ నుంచి తొలి మేడిన్‌ ఇండియా చిప్‌ రానుంది. గుజరాత్‌లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌ 2026 డిసెంబరు నాటికి చిప్‌లను ఉత్పత్తి చేయనుంది’’ అని వైష్ణవ్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని