SCSSలో మార్పులు.. రిటైర్డ్‌ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు అందేలా!

Senior Citizens Savings Scheme | రిటైర్డ్‌ ఉద్యోగులు సహా వారి జీవితభాగస్వాములకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేలా ‘సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌’లో ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసింది.

Published : 21 Nov 2023 12:45 IST

Senior Citizens Savings Scheme | ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యంత ఆదరణ ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ‘సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS)’ ఒకటి. ఇటీవల ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని కీలక మార్పులు చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా సవరణలు చేసింది. ఆ మార్పులేంటో చూద్దాం..

  • పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై  రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు అందిన మూడు నెలల వరకు వాటిని ఎస్‌సీఎస్‌ఎస్‌ (SCSS)లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి ఇది వర్తిస్తుంది. గతంలో ఈ గడువు నెల వరకు మాత్రమే ఉండేది.
  • సర్వీసులో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల ఇన్వెస్ట్‌మెంట్‌ నిబంధనలను సైతం ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. 50 ఏళ్లు దాటి సర్వీసులో ఉండగా మరణించిన ఉద్యోగుల జీవితభాగస్వాములు ఇకపై తమకు అందిన ఆర్థిక పరిహారాన్ని స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. 
  • రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల నిర్వచన పరిధిని సైతం ప్రభుత్వం విస్తరించింది. ఉద్యోగ విరమణ వల్ల అందే ప్రతి పేమెంట్‌ను రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌గానే పరిగణిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. భవిష్య నిధి బకాయిలు, గ్రాట్యుటీ, ఇతర పింఛన్లు, మిగిలిపోయిన సెలవులపై అందే చెల్లింపులు, ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లకు సంబంధించిన పొదుపులు, ఎక్స్‌గ్రేషియా.. ఇలా అన్నీ రిటైర్‌మెంట్ ప్రయోజనాల కిందకే వస్తాయని తెలిపింది. వీటన్నింటినీ ఎస్‌సీఎస్‌ఎస్‌ (SCSS)లో ఇన్వెస్ట్‌ చేయొచ్చని పేర్కొంది.
  • ముందస్తు ఉపసంహరణ నిబంధనలను సైతం ప్రభుత్వం కఠినతరం చేసింది. ఎస్‌సీఎస్‌ఎస్‌ (SCSS)లో డిపాజిట్‌ చేసిన ఏడాదిలోపు ఉపసంహరించుకుంటే.. మొత్తం నుంచి ఒకశాతం రుసుము కింద వసూలు చేస్తారు. ఇంతకు ముందు కేవలం వడ్డీ మాత్రమే తిరిగి తీసుకొని.. డిపాజిట్ మొత్తాన్ని ఇచ్చేసేవారు.
  • ఎస్‌సీఎస్‌ఎస్‌ (SCSS) పొడిగింపుపై ఉన్న పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. ఖాతాదారులు ఇకపై మూడేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా స్కీమ్‌ను పొడిగించుకునే వీలుంది. ప్రతిసారి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో కేవలం ఒకసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం ఇచ్చేవారు. స్కీమ్‌ మెచ్యూరిటీ తేదీ నాటికి ఉన్న వడ్డీరేటునే డిపాజిట్‌పై వర్తింపజేస్తారు.
  • ఖాతా తెరిచే సమయంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని మాత్రమే కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. మధ్యలో అదనపు మొత్తాన్ని జమ చేయడానికి అవకాశం ఉండదు. స్కీమ్‌ను పొడిగించుకునే సమయంలోనూ అదనపు మొత్తాన్ని డిపాజిట్‌ చేసే వీలుండదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం.. కొత్త అకౌంట్‌ను తెరిచి గరిష్ఠ పరిమితి మేరకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎస్‌సీఎస్‌ఎస్‌ (SCSS)లో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. 2023 బడ్జెట్‌లో దీన్ని ప్రకటించారు. ఒకవేళ ఖాతాదారులు మరణిస్తే.. జీవితభాగస్వామి దాన్ని కొనసాగించొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు