Mahindra recall: ఎక్స్‌యూవీ 700లో సమస్య.. లక్ష వాహనాలు రీకాల్‌

Mahindra and Mahindra: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా లక్ష ఎక్స్‌యూవీ 700లను రీకాల్ చేస్తోంది.

Updated : 19 Aug 2023 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra) భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్‌ చేస్తోంది. XUV 700 మోడల్‌కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది. వాహనంలో వైరింగ్‌ విషయంలో లోపాలు గుర్తించామని, తగు మార్పులు చేసి వినియోగదారులకు తిరిగి అప్పగిస్తామని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 2021 జూన్‌ 8 నుంచి 2023 జూన్‌ 28 మధ్య తయారైన 1,08,306 యూనిట్ల కార్లలోని ఇంజన్‌ బేలో వైరింగ్‌ లూమ్‌ రూటింగ్‌లోని లోపాల కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు గుర్తించామని మహీంద్రా తెలిపింది.

ఆఫీసులకు రాకుంటే ఇంటికే.. ఉద్యోగులకు మెటా హెచ్చరిక!

దీంతో పాటు కొన్ని ఎక్స్‌యూవీ 400 (XUV400) ఎస్‌యూవీలను సైతం రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్‌ 5 మధ్య తయారైన 3,560 యూనిట్లను ఈ విధంగా వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. ఎక్స్‌యూవీ 400 వాహనాల్లో బ్రేక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్‌ యాక్షన్‌లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ కార్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎలాంటి రుసుమూ లేకుండానే మరమ్మతులు చేసి ఇస్తామని పేర్కొంది. స్వచ్ఛందంగానే రీకాల్‌ చేపడుతున్నామని, కార్ల యజమానులకు వ్యక్తిగతంగానూ సమాచారం అందుతుందని పేర్కొంది.

ఇటీవల మారుతీ సుజుకీ ఇండియా కూడా పెద్ద ఎత్తున కార్లను రీకాల్‌ చేసింది. తన ఎస్‌-ప్రెస్సో (S-Presso), ఈకో (Eeco) మోడళ్లకు చెందిన 87,599 యూనిట్ల వాహనాలను వెనక్కి రప్పించింది. స్టీరింగ్‌ టై రాడ్‌లో లోపాన్ని సరిచేయటానికి ఈ రీకాల్‌ను సంస్థ చేపట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని