Musk vs Zuckerberg: జుకర్‌తో మస్క్‌ కేజ్‌ ఫైట్‌.. లైవ్‌ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గత కొంత కాలంగా మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పోరును లైవ్‌ స్ట్రీమ్ చేస్తామని మస్క్‌ ట్వీట్‌ చేశారు. 

Published : 06 Aug 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్‌ ( Mark Zuckerberg) మధ్య కేజ్‌ ఫైట్ (cage fight) జరగనుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం దీనికి సంబంధించి మస్క్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘‘జుకర్‌, మస్క్‌ మధ్య జరిగే పోరు ఎక్స్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ అవుతుంది. దాని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయి’’ అని మస్క్‌ ట్వీట్ చేశాడు. దీంతో మరోసారి వీరి మధ్య పోరు గురించి నెట్టింట చర్చ మొదలైంది. కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్‌, జుకర్‌బర్గ్‌ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఇవి తారస్థాయికి చేరాయి. ఎక్స్‌ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్‌ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ విమర్శలు చేశాడు. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను డిజైన్‌ చేశారని ఆరోపించాడు. 

డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ.. ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌...

ఈ క్రమంలోనే జుకర్‌బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్‌ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్‌ ఎక్స్‌లో పేర్కొన్నాడు. దీనిపై జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ ‘ప్లేస్‌ ఎక్కడో చెప్పు’ అంటూ సవాల్‌కు సై అన్నాడు. ‘వెగాస్‌ ఆక్టాగాన్’.. రా చూసుకుందాం’ అంటూ మస్క్‌ సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరూ కేజ్‌ ఫైట్‌లో తలపడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే, తొలుత ఇది కేవలం ప్రచారం కోసం జరుగుతుందని నెటిజన్లు భావించారు. కానీ, కొద్ది రోజులుగా ఇరువురు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడం.. శరీరాకృతిని ప్రదరిస్తూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుండటంతో వీరి మధ్య పోరు ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మస్క్‌ ట్వీట్‌ ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే, ఈ ఫైట్‌ ఎప్పుడు జరుగనుందో ఇంత వరకు తెలియరాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని