EPFO: ఈపీఎఫ్‌ఓ కనీస పింఛన్‌ పెంపునకు ఆర్థికశాఖ మోకాలడ్డు!

ఉద్యోగుల భవిష్యనిధి కనీస పింఛను మొత్తం పెంపుపై ఆర్థికశాఖ నుంచి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఒకటి వివరణ కోరనుంది. ప్రస్తుతం ఉన్న రూ.1000 పింఛను మొత్తాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతిపాదననలు పంపగా.. అందుకు ఆర్థిక శాఖ తిరస్కరించింది.

Published : 03 Nov 2022 19:08 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (EPF‌) కనీస పింఛను మొత్తం పెంపుపై ఆర్థికశాఖ నుంచి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఒకటి వివరణ కోరనుంది. ప్రస్తుతం ఉన్న రూ.1000 పింఛను మొత్తాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతిపాదననలు పంపగా.. అందుకు ఆర్థిక శాఖ తిరస్కరించింది. అందుకు గల కారణాలను స్టాండింగ్‌ కమిటీ తెలుసుకోనుంది. కార్మిక శాఖ ఎంత మేర పెంచాలని సిఫార్సు చేసిందనేది తెలియరాలేదు.

ఈపీఎఫ్‌ పింఛను పథకం, కార్పస్‌ ఫండ్‌ నిర్వహణకు సంబంధించి బిజూ జనతా దళ్‌ ఎంపీ భర్తృహరి మహతబ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ముందు గురువారం కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కనీస పింఛను మొత్తం పెంపుపై కార్మిక శాఖ సిఫార్సులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపలేదని స్టాండింగ్‌ కమిటీకి వారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తిరస్కరించడానికి గల కారణమేంటన్నదానిపై ఆర్థికమంత్రిత్వ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరాలని కమిటీ నిర్ణయించింది. ఈపీఎఫ్‌ చందాదారులకు ఇప్పుడిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్‌ ఏమాత్రం సరిపోదని, ఆ మొత్తాన్ని పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది మొదట్లో కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ పింఛను మొత్తం పెంచడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయగా.. అందుకు తిరస్కరించింది. కనీస పింఛను పెంపు కోసం లక్షలాది మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని