logo

అభివృద్ధి గమనం..జూన్ గమ్యం

రాజధానిలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జులై నాటికి ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేయాలని గడువు విధించింది.

Published : 30 Nov 2022 01:31 IST

నగరంలో కీలక పనుల పూర్తికి ప్రణాళిక

రాజధానిలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జులై నాటికి ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ క్రమంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రాజెక్టును రెండు నెలల్లో ప్రారంభించబోతున్నారు. మార్చి తర్వాత నుంచి దాదాపు 75 వేల రెండు పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాదిగా సర్కార్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే మహానగరం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.

నగరంలో రూ.వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. ఏడాదిగా కొన్ని పనులు పూర్తి చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మరికొన్నింటికి నిధుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ నగర అభివృద్ధి పనులపై నెలరోజులుగా వరుస సమీక్షలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి పనికి కార్యాచరణ రూపొందించి నిర్ణీత గడువు విధించారు. నిధుల విడుదలకూ చర్యలు తీసుకుంటున్నారు.

మార్చి నుంచి ఇళ్ల పంపిణీ

అయిదేళ్ల కిందటే లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని సర్కార్‌ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు రూ.5,500 కోట్లు ఖర్చు చేయగా ఇంకా రూ.3,457 కోట్లు అవసరం. ఇప్పటికే పదివేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించగా ప్రస్తుతం 75 వేల ఇళ్ల నిర్మాణం తుది దశలో ఉంది. వెంటనే పూర్తి చేసి మార్చి నుంచి పంపిణీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది.
ఎస్‌ఆర్‌డీపీ పనులపై దృష్టిట్రాఫిక్‌ ఇబ్బందులు పరిష్కరించేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు మొదటి దశ పనులన్నింటిని వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.6,763 కోట్లు కాగా ఇందులో రూ.3,854 కోట్ల విలువైన పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రాధాన్య క్రమంలో రెండో దశ పనులు వచ్చే జూన్‌ నుంచి మొదలుపెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

ఎంఎంటీఎస్‌ రెండో దశ

ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. 95 కిలోమీటర్ల పొడవున రూ.816 కోట్లతో 2014లో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోడంతో ప్రాజెక్టు పనులు పూర్తయినా రైళ్ల పరుగు మొదలు కాలేదు. రూ.200 కోట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో మొదలుపెట్టడానికి రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

మూసీ మీద వంతెనలు

మూసీపై మొదటి దశ కింద 15 చోట్ల రూ.595 కోట్లతో వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రోజుల కిందట దీనిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్‌ పారిస్‌లో ఉన్న తరహాలో వారధులు నిర్మించాలని ఆదేశించారు.

వచ్చే ఏడాది వరద ఉండకూడదంతే

రాజధానిలో వరద సమస్య అధిగమించేందుకు 56 నాలాల పనులను రూ.983.46 కోట్లతో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏడాదిగా ఈ పనులన్నీ నత్తనడకగా నడుస్తున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు వచ్చే వేసవి ముగిసే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పనికి గడువు విధించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులను అక్కడి నుంచి తప్పించబోతున్నారు.

మెట్రో విస్తరణకు మార్గం సుగమం

రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు సర్కార్‌ పచ్చజెండా ఊపింది. రూ.6,500 కోట్లతో ఈ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. దీంతోపాటు పాతబస్తీకి కూడా మెట్రో అడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని