logo

Hyderabad: హిజ్రాల ఆగడాలపై పోలీసుల దృష్టి

నగరంలో ఉన్న హిజ్రాలపై పోలీసులు దృష్టి సారించారు. హిజ్రాల ముసుగులో కొందరు చేస్తున్న ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతుండటంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Updated : 09 Dec 2022 11:31 IST

పంజాగుట్ట ఫ్లైఓవర్‌ వద్ద హిజ్రాకు డిజిటల్‌ చెల్లింపు చేస్తున్న వాహనదారుడు, పక్క చిత్రంలో పోలీసులు అరెస్టు చేసిన ట్రాన్స్‌జెండర్లు

న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: నగరంలో ఉన్న హిజ్రాలపై పోలీసులు దృష్టి సారించారు. హిజ్రాల ముసుగులో కొందరు చేస్తున్న ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతుండటంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న హిజ్రాల వివరాలు సేకరించడంతో పాటు ఎవరి ఆధ్వర్యంలో ఆయా హిజ్రాలు ముందుకు సాగుతున్నారనే విషయాలపై దృష్టి పెట్టారు.

ఇదీ పరిస్థితి.. నగరంలో దాదాపు ఏడు వేల మందికిపైగా హిజ్రాలు ఉంటారని పోలీసుల  అంచనా. మంగళవారం రాత్రి పంజాగుట్ట ఫ్లైఓవర్‌ కింద వాహనదారుడు ఓ హిజ్రాకు డిజిటల్‌ చెల్లింపులు చేస్తుండటాన్ని చెబుతూ ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.  నగరంలో ఎక్కడ గృహ ప్రవేశాలు జరిగినా, కొత్త వ్యాపార సముదాయాలు తెరిచినా, ఎలాంటి శుభకార్యాలు నిర్వహించినా అక్కడ హిజ్రాలు వాలుతున్నారు. కొద్దినెలల కిందట ఇలానే బంజారాహిల్స్‌లో ఓ మహిళా నేత కొత్త నివాస శుభకార్యానికి వచ్చిన హిజ్రాలు.. ఆమె వద్ద దాదాపు రూ.లక్ష, మరో నేత ఇంటి వద్ద శుభకార్యం చేసుకోగా అతని వద్ద రూ.లక్ష వసూలు చేశారు. ఇక చిన్నాచితక దుకాణాలు తెరిస్తే రూ. 5వేల నుంచి మొదలుకొని డిమాండ్‌ చేసినంత చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఓ ఐపీఎస్‌ సైతం తన ఇంట్లో శుభకార్యం నేపథ్యంలో వారికి డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నలుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్‌

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతంలో వ్యాపారాలున్న వెంకటేశ్వర ఏజెన్సీస్‌ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన మైలార్‌దేవులపల్లికి చెందిన ఖుషి అలియాస్‌ సయ్యద్‌ సమీర్‌, వికారాబాద్‌కు చెందిన సభ అలియాస్‌ సాలుం వాజిద్‌, బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌కు చెందిన మధు అలియాస్‌ మహమ్మద్‌ మస్తాన్‌ అలీ, జల్‌పల్లికి చెందిన నూరి అలియాస్‌ మహమ్మద్‌ నూరిలతో పాటు ఆటోడ్రైవర్లు కేశవగిరికి చెందిన ఆర్‌.శ్రీకాంత్‌, రాజేంద్రనగర్‌ సమీపంలోని హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ వాజిద్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని