logo

పది రోజులు.. పదో తరగతి పరీక్షలు

పది రోజుల్లో పదో పరీక్షలు రాయనున్న విద్యార్థుల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి.

Published : 26 Mar 2023 02:04 IST

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు
కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా

ఈనాడు, హైదరాబాద్‌: పది రోజుల్లో పదో పరీక్షలు రాయనున్న విద్యార్థుల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి మొదలయ్యే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మూడు జిల్లాల విద్యాశాఖాధికారులు శనివారం తీసుకున్నారు. వీటిని ఆదివారం నుంచి సమీప ఠాణాల్లో భద్రపరచనున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా గాలి, వెలుతురు, విద్యుత్తు సౌకర్యాలతో కూడిన గదులున్న వాటినే కేంద్రాలుగా ఎంపిక చేశారు.   విద్యార్థులు హాల్‌టికెట్లను ప్రిన్సిపాళ్ల వద్ద నుంచి లేదంటే ప్రభుత్వ వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

గాలి, వెలుతురు ఉండేలా..

ఎండల తీవ్రత ప్రారంభమవుతున్న దృష్ట్యా గాలి, వెలుతురు వచ్చేలా... విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగినా వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లున్న కేంద్రాలను ఎంపిక చేశారు.  మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు  ఎండ వేడిమి తీవ్రత తగలకుండా షామియానాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగు నీరు, తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ప్రశ్నపత్రాల గదుల్లో నిఘా నేత్రాలు.. 

ప్రశ్నపత్రాలను భద్రపరిచే గదుల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేయిస్తున్నారు. వాటిని సెట్ల వారీగా తీసేటప్పుడు వీడియోను చిత్రీకరించాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన డేటా కార్డును విద్యాశాఖాధికారులు అదే రోజు సేకరించనున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు ఎస్సెస్సీ బోర్డు అధికారులు, జిల్లా అధికారులకు పంపించాలని సూచించారు. ఇక గతేడాది ఏడెనిమిది పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, అమీర్‌పేట, గోల్కొండ, మెహిదీపట్నం ప్రాంతాల్లో ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతోపాటు జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగేందుకు అవకాశాలున్నాయంటూ అధికారులకు సమాచారం అందడంతో ఆయా కేంద్రాలపై రహస్యంగా నిఘా ఉంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు