logo

కాలు కదలాలంటే.. డబ్బులు చేతిలో పడాల్సిందే!

ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో సభలు, సమావేశాలు, కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే.

Published : 01 May 2024 04:40 IST

ఎన్నికల ప్రచారంలో నేతల పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో సభలు, సమావేశాలు, కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. అన్ని పార్టీల పరిస్థితి ఇదే. కచ్చితంగా స్థానిక నేతలు జనం తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. వాహనాలు పెట్టి జనాన్ని తరలించడమే కాకుండా...తమ పనులు మానుకొని వస్తున్నందుకు సాయంకాలానికి వారికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేదంటే మరోసారి సమావేశానికి పిలిచినా ముఖం చాటేస్తున్నారు. ఎప్పుడూ ఇచ్చే డబ్బులు కాకుండా అదనంగా ఇవ్వాలని పలువురు చోటామోటా నేతల వద్ద డిమాండ్‌ చేస్తున్నారు. ఎండలు  తీవ్రంగా ఉండటంతో ఆరేడు గంటలపాటు అక్కడ నిరీక్షించాలంటే ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. గతంలో పార్టీలకు అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉండేవారు. పార్టీలను అంటిపెట్టుకొని అవసరమైతే తమ జేబుల నుంచి ఖర్చు పెట్టి నాయకులను గెలిపించుకునేవారు. రానురాను రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ప్రజలు, కార్యకర్తల దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు చాలా తక్కువ. నీ పార్టీ ప్రచారానికి వస్తే...నాకేంటి అనే ధోరణి ఇప్పుడు ఎక్కువగా కన్పిస్తోంది. అభ్యర్థుల నామినేషన్‌ నాటి నుంచి ఎన్నికల సభలు, రోడ్‌షోలు ఇతర అన్ని ప్రచార కార్యక్రమాలకు జనసమీకరణ అభ్యర్థులకు కత్తిమీద సామే అవుతోంది. గ్రేటర్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్‌షోలు, సభలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో పార్లమెంట్‌ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాల్లో రోడ్‌షో, ఇంటింటి ప్రచారానికి కనీసం 100-200 మంది వరకు అవసరం. మొత్తం రోజంతా ప్రచారం నడవాలంటే చేతిలో డబ్బులు పడాల్సిందే. లేదంటే కాలు కదిపేది లేదంటున్నారు.

కింది స్థాయి నుంచే...

జనసమీకరణలో చోటామోటా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వేయి నుంచి రెండు వేలమంది ఓటర్లను ప్రభావితం చేసే నేతలను అభ్యర్థులు తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇందుకు నేత స్థాయిని బట్టి నిధులు ముడుతున్నాయి. బైకు ర్యాలీలు, ప్రచారానికి అడ్డా కూలీలు, బస్తీల్లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. యువతను తరలించడానికి భారీగా ఖర్చు చేయాలి. పెట్రోల్‌, భోజనాలు, సాయంత్రం పార్టీలకు ఖర్చు రాజకీయ నేతలే భరించాలి. ఉదయం 2 గంటలు, సాయంత్రం మరో 2 గంటలు అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొనాలంటే భోజనం ఇతర ఖర్చులతో కలిపి రూ.500-700 వరకు ఇవ్వాలి. అయితే ప్రచారానికి కూలీల డిమాండ్‌ ఉండటంతో వారు కూడా రేట్లు పెంచుతున్నారు. ఎండలో తిరిగి ప్రచారం చేయాలంటే ఎక్కువే ఇవ్వాలంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని