MALTA : దయ్యాల కోసం ఆ దేశంలో రెండు గడియారాలు పెడుతున్నారు!

మాల్టా (Malta).. దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం. మొత్తం జనాభా సంఖ్య 5.2 లక్షలు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన మాల్టాలో సుమారు 360 దాకా చర్చిలున్నాయి (Churches). అక్కడి ప్రతి చర్చి ఎదుట రెండు గడియారాలు (Clocks) కన్పిస్తాయి. అవి వేర్వేరు సమయాలను తెలుపుతుంటాయి. దాని వెనకున్న కథేంటో తెలుసుకోండి. 

Published : 12 Jun 2023 16:12 IST

విదేశీ విహార యాత్రలు చేసే వారెవరైనా ఒక సారి మాల్టా (Malta) వెళితే తికమక పడిపోతారు. ఎందుకంటే అక్కడున్న ప్రతి చర్చిపై (Church) రెండు గడియారాలు కన్పిస్తుంటాయి. వాటిలో వేర్వేరు సమయాలుంటాయి (Time). అది పొరపాటా? ప్రాంకా? ఉద్దేశపూర్వకంగానే అలా పెట్టారా? అనే విషయం స్థానికులు చెబితే తప్ప గందరగోళం నుంచి బయటపడలేరు. ఇంతకీ ఆ గడియారాల వెనుకున్న గమ్మత్తు ఏంటో తెలుసుకుందాం పదండి.

ప్రచారంలో ఎన్నో వాదనలు

రెండు గడియారాలు ఎందుకు పెడుతున్నారనే విషయంపై భిన్న వాదనలున్నాయి. ఏది సరైన వాదన అనే విషయంపై చరిత్రకారులు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఎక్కువగా నమ్మే వాదన ఏమిటంటే దయ్యాలను తికమక పెట్టాలని రెండు గడియారాలు పెట్టారట. చర్చిలో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నప్పుడు దయ్యాలు వస్తే తొందరగా వచ్చామేమో? ఆలస్యంగా వచ్చామేమో? అని అవి తికమక పడేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు కొందరు చెబుతున్నారు. రెండు గడియారాలు వేర్వేరు సమయాలు చూపిస్తున్నా విశ్వాసులు వాటితో సంబంధం లేకుండా చర్చి గంటలు మోగే శబ్దాన్ని బట్టి ప్రార్థనలకు వెళ్తుంటారు.

మరో వివరణ ప్రకారం.. రెండు గడియారాలను సమాజంలో వివిధ రకాల వ్యక్తుల కోసం ఏర్పాటు చేశారట. ఒక గడియారం రైతులకు ఉపయోగపడుతుంది. అంటే వారు తొందరగా లేచి పొలం పనులకు వెళ్లడానికి సహాయ పడుతుంది. మరోది జాలర్ల కోసం. వీరు సమయాన్ని బట్టి కాకుండా అలల తాకిడి, రుతువుల ఆధారంగా వేటకు వెళ్తుంటారు. దాంతో రెండో గడియారంలో సమయం తప్పుగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకో ప్రచారంలో ఒక గడియారం స్థానిక సమయాన్ని, మరో గడియారం రోమ్‌ సమయాన్ని చూపిస్తుందని అంటారు. రెండు గడియారాలుంటే ఒకటి పని చేయకపోయినా మరొక దాని ద్వారా అసలు సమయం తెలుసుకోవచ్చనే ఆలోచనతో అలా పెట్టి ఉంటారని ఇంకొందరు చెబుతున్నారు.

గ్రామానికి పీడ పట్టిందని..

రెండు గడియారాలను దుష్ట ఆత్మలను పారద్రోలడానికి పెట్టారని స్థానిక జానపద సాహిత్యం చెబుతోంది. దాని ప్రకారం 18వ శతాబ్దంలో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పట్లో మాల్టా గ్రామాన్ని దురదృష్టాలు వెంటాడుతుండేవి. పంటలు పండకపోవడం, అంటు వ్యాధులు ప్రబలడం, ఆకస్మిక మరణాలు సంభవించడం వంటి పరిణామాలు వరసగా జరిగాయి. దాంతో తమ గ్రామం శాపానికి గురైందని, పీడ పట్టిందని స్థానికులు నమ్మసాగారు. ఏం చేయాలో పాలుపోక చివరికి గ్రామ మతాధికారిని సంప్రదించారు. ఆయన సలహా మేరకు గ్రామ కూడలిలో రెండు గడియారాలు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సరైన సమయాన్ని సూచిస్తే.. మరోకటి ఐదు నిమిషాలు ముందుండేది. ఈ సమయ వ్యత్యాసం దుష్ట శక్తులను గందరగోళానికి గురి చేస్తుందని ఆయన నమ్మాడు. దాంతో అవి గ్రామం విడిచిపోతాయని భావించాడు. ఊహించినట్లుగానే కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మార్పు కనిపించింది. పంటలు సమృద్ధిగా పండాయి. వ్యాధులు, బాధలు దూరమయ్యాయి. అప్పటి నుంచి మాల్టాకు రెండు గడియారాల గ్రామం అనే పేరు వచ్చింది. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి చర్చి వద్ద రెండు గడియారాలు అమర్చుతున్నారు. కుడి వైపు అసలు సమయం, ఎడమ వైపు తప్పు సమయం పెడుతున్నారు. దాంతో మాల్టా గడియారాల కథ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని