ISRO chief: ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆదిత్య ప్రయోగం రోజే తెలిసిందట!

‘ఆదిత్య ఎల్‌ 1 (Aditya-L1 mission)’ ప్రయోగం చేపట్టిన రోజే తనకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలిసిందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు.

Updated : 04 Mar 2024 19:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్‌ సోమనాథ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘ఆదిత్య ఎల్‌ 1 (Aditya-L1 mission)’ ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఓ మలయాళం వెబ్‌ ఛానల్‌ (Tarmak Media House)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.

‘చంద్రయాన్‌-3 ప్రయోగం (Chandrayaan 3) సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ, ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నా. కొద్ది సమస్య ఉన్నట్లు గుర్తించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్‌లు చేయించాను. అప్పుడే నాకు అర్థమైంది. నా కడుపులో కణితి పెరిగిందని. మరో రెండు, మూడు రోజుల తర్వాత నిర్ధరణ అయ్యింది. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి’ అని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగులు షాక్‌కు గురయ్యారన్నారు.

‘సెప్టెంబర్‌ 2, 2023న ఆదిత్య ఎల్‌1 ప్రయోగం చేపట్టిన తర్వాత ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నా. అలా అవన్నీ భరించాల్సి వచ్చింది. అయితే, మొత్తంగా నాలుగు రోజులే ఆసుపత్రిలో ఉన్నా. ఐదోరోజు నుంచి ఇస్రోలో రోజూవారీ బాధ్యతల్లో నిమగ్నమయ్యా. తొలుత కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్‌కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది’ అని ఇస్రో చీఫ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని