Supreme Court: ప్రత్యక్ష సాక్షి లేకపోతే.. నేరానికి గల కారణమే కీలకం: సుప్రీం

ఓ నేరాన్ని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు.. ఘటనకు గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రత్యక్ష సాక్షి లేనప్పుడు మాత్రం.. నేరానికి ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.

Updated : 22 Jul 2023 16:12 IST

దిల్లీ: ఒక నేరం జరిగితే దాన్ని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షులు (eyewitness) లేని సమయంలో.. కనీసం ఆ ఘటనకు ప్రేరేపించిన కారణాన్నైనా (Motive) రుజువు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. 2008 నాటి హత్య కేసు (Murder Case)లో దోషిగా తేలిన ఓ వ్యక్తి తన శిక్షను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన మేనల్లుడిని హత్య చేశారంటూ 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల నుంచి ఇంటికి తిరిగొస్తున్న తన మేనల్లుడిని అతడి స్నేహితుడు దాడి చేసి చంపేశాడని, తాను ఘటనాస్థలానికి వెళ్లేసరికి నిందితుడు పారిపోయాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఘటనాస్థలంలో ఆయుధం దొరికింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు అతడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

బియ్యం ఎగుమతలపై నిషేధం.. అమెరికాలో ఎన్నారైల తిప్పలు

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ‘‘ఈ కేసులో మృతుడి మామ చెప్పిన వాంగ్మూలాన్ని నమ్మలేం. నేరారోపణకు అది సరైన ఆధారం కాదు. ఈ కేసులో నేరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. సాధారణంగా ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు నేరానికి గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేనందున ఘటనకు ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుంది. దాన్ని ప్రాసిక్యూషన్‌ నిరూపించాలి. ఇక, మృతుడికి, నిందితుడికి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని సాక్షులు చెప్పారు’’ అని ధర్మాసనం తెలిపింది.

ఘటన జరిగిన ప్రదేశంలో దొరికిన ఆయుధం కారణంగా అతడు చనిపోలేదని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్లు ధర్మాసనం గుర్తించింది. ‘‘నిందితుడు ఏ కారణం లేకుండా తన స్నేహితుడిని ఎందుకు చంపుతాడన్నది ప్రాసిక్యూషన్‌ రుజువు చేయలేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల, సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని