CBFC: విశాల్‌ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?

నటుడు విశాల్‌ చేసిన ఆరోపణలపై సెన్సార్‌ బోర్డు స్పందించింది. అవినీతికి పాల్పడింది సెన్సార్‌ సభ్యులు కాదని, థర్డ్‌పార్టీ వారిని తెలిపింది. సినిమాల సెన్సార్‌ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే చేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 05 Oct 2023 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ - సీబీఎఫ్‌సీ (Central Board of Film Certification) ముంబయి కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్‌ (Vishal) ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశం అనంతరం సెన్సార్‌ బోర్డు స్పందించింది. విశాల్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసింది సెన్సార్‌ సభ్యులు కాదని, థర్డ్‌పార్టీ వారని తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ‘ఈ- సినీప్రమాన్‌’ను వేదిక చేసుకోవాలని దర్శక, నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. నిబంధనలు పాటిస్తూ నిర్ణీత సమయంలోనే సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ‘‘సీబీఎఫ్‌సీ ప్రతి సంవత్సరం 12 వేల నుంచి 18 వేల చిత్రాలకు సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఇన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు’’ అని గుర్తు చేసింది.

విశాల్‌ చేసిన ఆరోపణలేంటంటే?

‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్‌ కొన్ని రోజుల క్రితం ట్వీట్‌ చేశారు. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన పేర్కొన్నారు. ‘‘అవినీతి గురించి తెరపై చూడడం ఓకే గానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇది జరుగుతోంది. నా ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు రూ. 6.5 లక్షలిచ్చా (స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు). నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరి ‘ఎక్స్‌’ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ పోస్ట్‌లో పెట్టారు. దీనిపై స్పందించిన సెన్సార్డు బోర్డు సమావేశం నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని