Guntur Kaaram: ఇకపై మీరే నాకు అమ్మ, నాన్న: వేదికపై మహేశ్‌బాబు భావోద్వేగం

మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 09 Jan 2024 21:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై అభిమానులే తనకు అమ్మ, నాన్న అని అన్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు- దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. జవనరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గుంటూరులో అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహించారు (Guntur Kaaram Pre Release Event).

‘గుంటూరు కారం’ టికెట్‌ ధరల పెంపు

‘‘గుంటూరులో ఈ సినిమా వేడుక జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మీరు (ఫ్యాన్స్‌) త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. ‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎక్కడ నిర్వహించాలా?’ అని మేమంతా చర్చించుకుంటుంటే.. ‘మీ ఊరిలో చేద్దాం’ అని అన్నారు. త్రివిక్రమ్‌ నాకు స్నేహితుడికంటే ఎక్కువ. కుటుంబ సభ్యుడిలాంటివారు. గత రెండేళ్లుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ నేను ఎప్పటికీ మర్చిపోను. ‘అతడు’తో మా ప్రయాణం మొదలైంది. ‘ఖలేజా’తో మ్యాజిక్‌ జరిగింది. అదే మ్యాజిక్‌ ‘గుంటూరు కారం’లోనూ కనిపిస్తుంది. మీరు కొత్త మహేశ్‌బాబును చూడబోతున్నారు. తెలుగమ్మాయి శ్రీలీల స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుండడం సంతోషంగా ఉంది. ఆమెతో కలిసి డ్యాన్స్‌ చేయడం కష్టం. మేం అడగ్గానే ఏం ఆలోచించకుండా ఓ కీలక పాత్రలో నటించేందుకు మీనాక్షి చౌదరి అంగీకరించింది. ఆమెకు థ్యాంక్స్‌. సంగీత దర్శకుడు తమన్‌ నా సోదరుడిలాంటివాడు. నేను, త్రివిక్రమ్‌ ఇచ్చిన సూచన మేరకు ‘కుర్చీ మడత పెట్టి’ పాటను కంపోజ్‌ చేశాడు. సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు థియేటర్లు బద్దలైపోతాయి’’ అని ఆసక్తి పెంచారు.

అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఫోన్‌ కాల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాడిని. ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని