Kanguva: ‘కంగువ’ పూర్తి చేసిన సూర్య.. మణిరత్నం చిత్రంలో జోజూజార్జ్‌

కంగువ విశేషాలను పంచుకున్న సూర్య.. కమల్‌-మణిరత్నం చిత్రంలో వాళ్లిద్దరూ కీలక పాత్రలు..

Published : 11 Jan 2024 02:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కంగువ’. వినూత్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తన వర్క్‌ పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) పోస్ట్‌ పెట్టారు.

‘‘కంగువ’లో నా చివరి షాట్‌ పూర్తయింది. సినిమా పట్ల మొత్తం యూనిట్‌ పాజిటివ్‌గా ఉంది. ఒక ముగింపు మరెన్నింటికో ఆరంభం. దర్శకుడు శివ, ఆయన బృందానికి ధన్యవాదాలు. ఈ మూవీ నాకెంతో స్పెషల్‌. థియేటర్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, సినిమాలో తాను పోషించిన పాత్రకు సంబంధించిన స్టిల్‌ను కూడా పంచుకున్నారు.

కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఏకంగా 38 భాషల్లో విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్స్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది.


‘థగ్స్‌ లైఫ్‌’లోకి అడుగు పెట్టనున్న కార్తిక్‌, జోజూ జార్జ్‌

కమల్‌హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా మణిరత్నం (Mani Ratnam) రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life). రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో త్రిష కథానాయికగా కనిపించనుండగా.. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి తమిళ యువ హీరో గౌతమ్‌ కార్తిక్‌ కూడా వచ్చి చేరాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’తో కార్తిక్‌ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. మలయాళంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న జోజూ జార్జ్‌  కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌లను పంచుకుంది.


ఆడు జీవితం విడుదల తేదీ ఖరారు

బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆడుజీవితం’. ప్రముఖ మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అమలాపాల్‌ కథానాయిక. బ్లెస్సీ ఈ చితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10న మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) ‘ది గోట్‌లైఫ్‌: ఆడు జీవితం’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని