Ambani succession plan: రిలయన్స్‌ బోర్డులోకి ముకేశ్‌ అంబానీ వారసులు

Ambani succession plan: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన వారసత్వ ప్రణాళికను క్రమంగా అమలు చేస్తున్నారు. గత ఏడాది తన ముగ్గురు పిల్లలకు వివిధ విభాగాల నిర్వహణ బాధ్యతలను అప్పగించిన ఆయన.. ఈసారి వారిని బోర్డులో నియమించారు.

Updated : 28 Aug 2023 17:30 IST

ముంబయి: ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తన వారసత్వ ప్రణాళిక (Ambani succession plan)ను క్రమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గత ఏడాదే తన ముగ్గురు పిల్లలు ఈశా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఆయన.. ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వీరు ముగ్గురు కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతల్లో మాత్రమే భాగస్వాములవుతూ వచ్చారు. ఇకపై కంపెనీ నిర్ణయాలు, విధానాల రూపకల్పనల్లోనూ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

ఈరోజు రిలయన్స్‌ వార్షిక సాధారణ సమావేశ (Reliance AGM) నిర్ణయాలను కంపెనీ ప్రకటించింది. దీనికి ముందు కంపెనీ బోర్డు సమావేశమైంది. ఈశా, అనంత్‌, ఆకాశ్‌లను బోర్డు సభ్యులుగా నియమిస్తూ అందులో నిర్ణయం తీసుకున్నారు. వీరు ఇకపై నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో సైతం కంపెనీ వెల్లడించింది. షేర్‌హోల్డర్ల ఆమోదం లభించిన వెంటనే వారు తమ కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారని తెలిపింది.

డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5జీ.. వినాయక చవితికి ఎయిర్‌ఫైబర్‌

గత ఏడాది రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బాధ్యతల్ని ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఇన్ఫోకామ్‌ అనుబంధ సంస్థగా ఉంది. ప్లాట్‌ఫామ్స్‌ మాతృసంస్థే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్‌, మెటా వంటి బడా సంస్థలకు వాటాలు ఉన్నాయి. మరోవైపు ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్‌ రిటైల్‌ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్‌ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్‌ నిర్వహణని స్వీకరించారు.

మరోవైపు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) మరో ఐదేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్‌ హోదాలో కొనసాగేందుకు రిలయన్స్‌ తమ షేర్‌హోల్డర్ల అనుమతి కోరనుంది. అలాగే ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బోర్డు డైరెక్టర్‌గా వైదొలగారు. తమ పిల్లలకు మార్గం సుగమం చేయడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె నిర్ణయాన్ని బోర్డు వెంటనే ఆమోదించింది. ఇకపై ఆమె పూర్తిగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ కార్యకలాపాలను చూసుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని