ITR Filing: ఐటీఆర్‌ డెడ్‌లైన్‌ మిస్‌ అయ్యారా? ఇప్పటికీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయొచ్చు..

ITR Filing: గడువు తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేకపోయారా? జరిమానా చెల్లించి ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయొచ్చు. 

Published : 01 Aug 2023 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు జులై 31తో గడువు ముగిసింది. ఏదైనా కారణంతో ఒకవేళ ఇంకా రిటర్నులు సమర్పించలేకపోయారా? అయితే చింతించాల్సిన అవసరం లేదు. ఐటీఆర్‌ దాఖలుకు ఇంకా అవకాశం ఉంది. అయితే, దాన్ని ఆలస్య రిటర్నుల కింద పరిగణించి రుసుము విధిస్తారు. దీన్నే బిలేటెడ్‌ ఐటీఆర్‌గా (Belated ITR) పేర్కొంటారు. ఆదాయ పన్ను చట్టంలోని 234ఎఫ్‌ కింద ఈ ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

బిలేటెడ్‌ ఐటీఆర్‌ కింద ఆలస్య రుసుము చెల్లించి డిసెంబరు 31 వరకు రిటర్నులు దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను విభాగం వెసులుబాటు కల్పిస్తోంది. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారు రూ.1,000, రూ.5 లక్షలు మించిన వారు రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే.. అదనంగా నెలకు ఒక శాతం వడ్డీ వసూలు చేస్తారు. అయితే, దీర్ఘకాలిక మూలధన నష్టాలు ఉన్నవారు.. వీటిని మరుసటి ఏడాదికి బదిలీ చేసుకునే వీలుండదు. పన్ను పరిధిలోకి రాని వారు ఎలాంటి రుసుమూ లేకుండానే రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలుకు ముందే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చలాన్‌ నంబర్‌ 280ని ఉపయోగించి చెల్లింపుచేయాలి. ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా గానీ, బ్యాంకు శాఖలో కూడా ఆలస్య రుసుము చెల్లించే వెసులుబాటు ఉంది.

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేశారా... రిఫండ్ల విషయంలో ఈ తప్పులొద్దు!

ఆర్థిక సంవత్సరం 2017-18 నుంచి ఆలస్య రుసుము ప్రవేశ పెట్టారు. జులై 31 నుంచి డిసెంబరు 31 మధ్య రూ.5000, ఆ తర్వాత మార్చి 31 వరకు రూ.10000 జరిమానాతో ఆలస్య ఐటీఆర్‌ను సమర్పించేందుకు అప్పట్లో అవకాశం ఇచ్చేవారు. 2021 బడ్జెట్‌ 2021లో ఈ నిబంధనను మారుస్తూ సెక్షన్‌ 234ఎఫ్‌లో సవరణలు చేశారు. అప్పటి నుంచి ఐటీఆర్‌ దాఖలుకు డిసెంబరు 31నే ఆఖరు తేదీగా నిర్ణయించారు. గడువు కుదించిన నేపథ్యంలో ఆలస్య రుసుమును కూడా తగ్గించారు.

మరోవైపు చివరి రోజైన సోమవారం (జులై 31) ఆదాయపు పన్ను రిటర్నులు భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. గడువులోగా 6.50 కోట్ల మంది తమ ఐటీఆర్‌లను సమర్పించారు. జులై 31 ఒక్క రోజే సాయంత్రం 6 గంటల వరకు, 36.91 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్‌లో వెల్లడించింది. 1.78 కోట్ల మంది ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యారని తెలిపింది. గత ఏడాది జులై 31 నాటికి 5.83 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని