Byjus: ఉద్యోగుల వేతనాల కోసం ఇళ్లను తనఖా పెట్టిన బైజూ రవీంద్రన్‌!

Byjus: బైజూస్‌లో ఆర్థిక కష్టాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కోసం వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ తన సొంతిళ్లను తనఖా పెట్టినట్లు సమాచారం.

Updated : 05 Dec 2023 14:13 IST

Byjus | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byju's)కు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డట్లు సమాచారం. ఫలితంగా కంపెనీ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ (Byju Raveendran) తన సొంత ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం తాకట్టు పెట్టారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌’ కథనం వెల్లడించింది.

బెంగళూరులో ఉన్న రెండు ఇళ్లతో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఓ విల్లాను కూడా రవీంద్రన్‌ (Byju Raveendran) తనఖా పెట్టారని సమాచారం. తద్వారా 12 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూరాయని తెలుస్తోంది. వీటితో మాతృసంస్థ ‘థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఉద్యోగులకు వేతనాలు చెల్లించినట్లు కంపెనీ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

కంపెనీని ఒడుదొడుకుల నుంచి గట్టెక్కించేందుకు రవీంద్రన్ (Byju Raveendran) అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని సమాచారం. అలాగే ఆర్థిక ఒత్తిళ్ల నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ రీడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను 400 మిలియన్‌ డాలర్లకు విక్రయించే యత్నాల్లో ఉంది. మరోవైపు 1.2 బిలియన్‌ డాలర్ల రుణంపై వడ్డీ చెల్లింపుల విషయంలో బైజూస్‌ ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

రవీంద్రన్‌ (Byju Raveendran) సంపద ఓ దశలో ఐదు బిలియన్‌ డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. వ్యక్తిగత హోదాలో ఆయన తన షేర్లను తనఖా పెట్టి 400 మిలియన్‌ డాలర్ల వరకు సమకూర్చుకున్నారు. గత కొన్నేళ్లలో తన వ్యక్తిగత షేర్లను విక్రయించి 800 మిలియన్ డాలర్లు కంపెనీలోకి మళ్లించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు