DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘డీఏ’ పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యాన్ని(డీఏ) కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. తాజా పెంపుతో డీఏ మొత్తం 42 శాతానికి చేరనుంది.

Updated : 05 Feb 2023 17:10 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కరవు భత్యాన్ని(Dearness Allowance) నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ(DA) ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. ఈ విషయమై ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్ర ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘గతేడాది డిసెంబరుకు సంబంధించిన ‘పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ(CPI-IW)’ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఆర్థిక శాఖ ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు ఉంచనుందని తెలిపారు.

ఒకవేళ ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. తాజా డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరవు భత్యం పొందుతున్నారు. డీఏలో చివరి సవరణ సెప్టెంబర్ 28, 2022న జరిగింది. ఇది జులై 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని