మదుపర్ల నిధులకు మరింత భరోసా

సెకండరీ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేయాలంటే, మనకు డీమ్యాట్‌ ఖాతా ఉన్న స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ వద్ద నిధులు అట్టేపెట్టాలి. అక్కడి మన ఖాతాలో ఉన్న నిధులకు సమాన విలువలోనే షేర్లు కొనుగోలు చేసేందుకు వీలుంటోంది.

Published : 18 Jan 2023 02:51 IST

సెకండరీ మార్కెట్‌లో షేర్ల కొనుగోళ్లకూ మన బ్యాంక్‌ ఖాతా నుంచే నేరుగా బదిలీ
స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థల వద్ద నిధులు అక్కర్లేదు
సెబీ ప్రతిపాదన

సెకండరీ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేయాలంటే, మనకు డీమ్యాట్‌ ఖాతా ఉన్న స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ వద్ద నిధులు అట్టేపెట్టాలి. అక్కడి మన ఖాతాలో ఉన్న నిధులకు సమాన విలువలోనే షేర్లు కొనుగోలు చేసేందుకు వీలుంటోంది. ఇకపై స్టాక్‌బ్రోకర్‌కు కాకుండా, నేరుగా మన బ్యాంక్‌ ఖాతాలోనే నిధులు అట్టే పెట్టుకుని, షేర్ల కొనుగోలుకు వీలు కల్పించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదిస్తోంది. ఇందువల్ల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టొచ్చని, స్టాక్‌ బ్రోకింగ్‌ల ఎగవేతల నుంచి మదుపర్లను కాపాడొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్‌లో షేర్ల కేటాయింపు జరిగే వరకు నిధులను మదుపర్ల బ్యాంక్‌ ఖాతాలోనే అట్టేపెట్టి (బ్లాక్‌ చేసి) ఉంచుతున్నారు. ఏఎస్‌బీఐ (అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌)గా దీనిని వ్యవహరిస్తారు. దీనినే సెకండరీ మార్కెట్‌ కార్యకలాపాలకూ అమలు చేయాలని సెబీ భావిస్తోంది.

పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసినప్పుడు

ప్రైమరీ మార్కెట్‌లో.. కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు మదుపర్లు దరఖాస్తు చేస్తుంటారు. దరఖాస్తు సమయం నుంచి షేర్ల కేటాయింపు జరిగే వరకు, ఇందుకవసరమైన నిధులు మదుపర్ల బ్యాంక్‌ ఖాతాలోనే తాత్కాలికంగా స్తంభింప (బ్లాక్‌) చేస్తారు. షేర్లు కనుక లభిస్తే, మదుపరి బ్యాంక్‌ ఖాతా నుంచి నిధులు కంపెనీకి వెళ్తాయి. లేకపోతే, ఆ నిధులకు స్తంభన నుంచి విముక్తి లభిస్తుంది. మన అవసరాలకు వాడుకోవచ్చు.

* అదే సెకండరీ మార్కెట్‌లో చూస్తే, మదుపర్ల మధ్య షేర్ల క్రయవిక్రయాలు జరుగుతాయి. స్టాక్‌బ్రోకర్‌ వద్ద మన ఖాతాలో ఉన్న నగదుకు విలువకు సమానమైన షేర్లను కొనుగోలు చేయొచ్చు. మన బ్యాంక్‌ ఖాతాలో నిధులున్నా, స్టాక్‌బ్రోకర్‌కు బదిలీ చేసే వరకు షేర్లు కొనలేము. ఈ విధానాన్ని మార్చి, ప్రైమరీ మార్కెట్‌ తరహాలోనే.. సెకండరీ మార్కెట్‌లోనూ మనం షేర్లకు ఆర్డర్‌ పెట్టగానే, అంతకు సమానమైన మొత్తం మన బ్యాంకు ఖాతాలో స్తంభింప చేస్తారు. మన డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల అలాట్‌మెంట్‌ జరగ్గానే, నిధులు బదిలీ అవుతాయి. దీని వల్ల స్టాక్‌ బ్రోకర్‌కు నిధులను బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు.

* క్లయింట్‌ లేదా మదుపర్లు, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ (సీసీ) మధ్య నేరుగా నిధుల సెటిల్‌మెంట్‌ (పే-ఇన్‌, పే-అవుట్‌) జరుగుతుంది. తాజా ప్రతిపాదనపై ఫిబ్రవరి 16 లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రజలను సెబీ కోరింది.

* ప్రస్తుత విధానం ప్రకారం.. మదుపర్ల నిధులు స్టాక్‌ బ్రోకర్‌, క్లియరింగ్‌ మెంబర్‌ ద్వారా సీసీకి చేరతాయి. క్లియరింగ్‌ కార్పొరేషన్‌ విడుదల చేసే పేఅవుట్‌ నిధులు కూడా... స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ మెంబర్‌ ద్వారానే మళ్లీ మదుపరికి చేరుతున్నాయి. నూతన విధానంలో ఇది మారుతుంది.

* ప్రస్తుతం ప్రతి స్టాక్‌ బ్రోకర్‌ వద్ద, వృథాగా నిల్వ ఉన్న మదుపర్ల నిధులను ప్రతి త్రైమాసికం చివరకు సంబంధితుల బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేస్తున్నారు.

ఈనాడు వాణిజ్య విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని