కంటి చుక్కల మందుపై యూఎస్లో కలకలం
భారతీయ ఔషధ కంపెనీలు మందుల నాణ్యత విషయంలో అంతర్జాతీయంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.
హానికారక బ్యాక్టీరియా గుర్తింపు, కొందరికి అస్వస్థత
సరఫరా చేసిన భారతీయ కంపెనీపై చర్యలు?
పూర్వాపరాలపై ‘ఫార్మాగ్జిల్’ విచారణ
ఈనాడు - హైదరాబాద్: భారతీయ ఔషధ కంపెనీలు మందుల నాణ్యత విషయంలో అంతర్జాతీయంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆఫ్రికాలోని గాంబియాలో దగ్గు మందు కారణంగా 66 మంది పిల్లలు చనిపోగా.. ఆ మందు సరఫరా చేసిన మేడెన్ ఫార్మా ఇబ్బందుల్లో పడింది. మరియోన్ బయోటెక్ అనే కంపెనీకి చెందిన మందును ఉజ్బెకిస్తాన్లో వినియోగించి 18 మంది పిల్లలు ప్రాణాపాయానికి గురయ్యారు. తాజాగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ అనే సంస్థ, అమెరికా మార్కెట్కు ‘కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్’ పద్ధతిలో సరఫరా చేసిన కంటి చుక్కల మందు విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది.
ఇలా కనిపెట్టారు..
‘ఎజ్రికేర్’ అనే బ్రాండు పేరుతో ఈ సంస్థ కంటి చుక్కల మందును అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ మందు సీసాలో ‘సూడోమనాస్ ఏరుజినోసా’ అనే ఒక హానికారక బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మందులకు లొంగదు. దీనివల్ల యూఎస్లోని కాలిఫోర్నియా, కొలరాడో, కనెటికట్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, న్యూయార్క్... తదితర ప్రాంతాల్లో 55 మందికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకడమే కాకుండా, కొందరికి కంటి సమస్యలు ఎదురైనట్లు, ఒకరు చనిపోయినట్లు వెలుగులోకి రావడంతో పెద్ద కలకలం రేగింది. దీనిపై యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించటంతో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) రంగంలోకి దిగి, ఈ మందును గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ నుంచి దిగుమతి చేయకుండా నిషేధించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా మార్కెట్ నుంచి ఈ మందును వెనక్కి తీసుకోవాలని గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ నిర్ణయించింది. ఈ తాజా వ్యవహారం మనదేశంలో అటు ఫార్మా పరిశ్రమ వర్గాల్లో, ఇటు ఔషధ నియంత్రణ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ), ఫార్మాగ్జిల్ (ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) రంగంలోకి దిగాయి.
పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం
ఇప్పటికే గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఫార్మాగ్జిల్ కోరింది. మీకున్న ఔషధ ఎగుమతుల లైసెన్సులు ఎన్ని? ఏ ఔషధాలకు అనుమతులు తీసుకున్నారు? సంబంధిత పూర్తి సమాచారాన్ని వెంటనే తెలియజేయాలంటూ ఆదేశించింది. అంతేగాక అమెరికా మార్కెట్కు సరఫరా చేసిన మందు విషయంలో ఎందుకు సమస్యలు తలెత్తాయనేది పరిశీలించి ఆ వివరాలు కూడా సత్వరం అందించాలని స్పష్టం చేసింది. ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ను దీనిపై ‘ఈనాడు’ సంప్రదించగా.. ‘మన ఔషధ పరిశ్రమకు ఇది ఎంతో నష్టం కలిగించే వ్యవహారం. తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నాం. యూఎస్ మార్కెట్ మనకు ఎంతో ముఖ్యం. మన ఔషధ ఎగుమతుల్లో మూడో వంతు యూఎస్ మార్కెట్కు వెళ్తున్నాయి. అందువల్ల ఇది మన ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న అంశం’ అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా యూఎస్తో పాటు అంతర్జాతీయంగా భారతీయ ఔషధ పరిశ్రమ ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. యూఎస్ వెలుపల యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉన్న యూనిట్లు అత్యధికంగా మన దేశంలోనే ఉన్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
-
India News
Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్టు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Nara Devansh: నారా దేవాన్ష్ పుట్టినరోజు.. తితిదేకు లోకేశ్-బ్రాహ్మణి విరాళం
-
India News
Amritpal Singh: అమృత్పాల్ రెండో కారు, దుస్తులు సీజ్.. పంజాబ్ దాటేసి ఉంటాడా?
-
World News
COVID19: కొవిడ్ మూలాలు బహిర్గతం చేసే బిల్లుపై బైడెన్ సంతకం