2023-24లో భారత వృద్ధి 6.5- 6.7%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ వృద్ధిరేటు 6.5- 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం సీఐఐ అధ్యక్షుడు ఆర్‌.దినేశ్‌ అంచనా వేశారు. ప్రభుత్వ మూలధన వ్యయాలకు తోడు దేశీయంగా పటిష్ఠంగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఇందుకు అండగా నిలుస్తాయని అన్నారు.

Published : 02 Jun 2023 03:51 IST

సీఐఐ అధ్యక్షుడు ఆర్‌.దినేశ్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ వృద్ధిరేటు 6.5- 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం సీఐఐ అధ్యక్షుడు ఆర్‌.దినేశ్‌ అంచనా వేశారు. ప్రభుత్వ మూలధన వ్యయాలకు తోడు దేశీయంగా పటిష్ఠంగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఇందుకు అండగా నిలుస్తాయని అన్నారు. ఈ దశాబ్దం (2021-22 నుంచి 2030-31)లో భారత జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదు కావచ్చని, మునుపటి దశాబ్దంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ సంస్కరణల కారణంగా అత్యంత వేగవంత వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్‌ నిలిచిందని, రాబోయే రోజుల్లో ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీ-20 అధ్యక్షతతో భారత్‌కు ప్రాధాన్యం పెరిగిందని, మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు దినేశ్‌ తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఫలితంగా కీలక రేట్ల పెంపులకు ఆర్‌బీఐ విరామం ఇవ్వొచ్చని వెల్లడించారు. 2022-23 మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ 6.1 శాతం వృద్ధి చెందగా.. మొత్తం వార్షిక వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ విలువ 3.3 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. వచ్చే కొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదగాలన్న భారత్‌ లక్ష్యానికి రంగం సిద్ధం చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని