Airbags in cars: కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కాదు: గడ్కరీ

Gadkari on Airbag rule: కార్లలో ఎయిర్‌బ్యాగులకు సంబంధించిన గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆరు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయాలని అనుకోవడం లేదని తెలిపారు. 

Published : 13 Sep 2023 16:39 IST

దిల్లీ: కార్లలో ఎయిర్‌బ్యాగులకు (Airbags) సంబంధించి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) కీలక ప్రకటన చేశారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని తెలిపారు. కార్లలో ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి ఆరు ఎయిర్‌ బ్యాగులు నిబంధన తీసుకురానున్నట్లు గతంలో మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. తప్పనిసరి చేయాలనుకోవడం లేదని తెలిపారు.

కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చేందుకు భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (BNCAP)ను ఇటీవల తీసుకొచ్చినట్లు గడ్కరీ తెలిపారు. దీంతో ఒక కారు 5 స్టార్‌ రేటింగ్‌ పొందాలంటే 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మెరుగైన స్టార్‌ రేటింగ్‌ అందుకునే క్రమంలో ఆరు ఎయిర్‌బ్యాగులను కార్ల కంపెనీలు అమర్చాల్సి ఉంటుందని, అందుకే తాము తప్పనిసరి చేయాలని అనుకోవడం లేదని గడ్కరీ తెలిపారు.

‘భారత్‌ ఎన్‌క్యాప్‌’ వచ్చేసింది.. కార్లకు స్టార్ రేటింగ్‌ ఎప్పటి నుంచంటే?

రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రయాణికుడికి ప్రాణాలను రక్షించేందుకు ఎయిర్‌బ్యాగులు ఉపయోగపడతాయన్న సంగతి తెలిసిందే. దేశంలో 2021 ఏప్రిల్‌ 1 నుంచి కారు ముందు వరుస సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి నిబంధన అమలవుతోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనను తీసుకురానున్నట్లు గతేడాది వెల్లడించారు. దీనిపట్ల తొలుత ఆటోమైబైల్‌ కంపెనీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది కూడా. లగ్జరీకార్లకు 8 ఎయిర్‌బ్యాగులు ఇస్తున్నప్పుడు, చిన్న కార్లకు 6 బ్యాగులు ఇవ్వడంలో ఉన్న ఇబ్బందేంటని గడ్కరీ అప్పట్లో ప్రశ్నించారు. మరోవైపు ఇటీవల భారత్ ఎన్‌క్యాప్‌ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్టోబర్‌ 1 నుంచి ఇది అమలు కానుంది. ఈ విధానంలో క్రాష్‌ టెస్ట్‌ అనంతరం కార్ల స్టార్‌ రేటింగ్ వివరాలను భారత్‌ ఎన్‌క్యాప్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని