హైదరాబాద్‌ To అయోధ్య, వారణాసి టూర్‌.. IRCTC ప్యాకేజీ వివరాలు..

IRCTC tour package: అయోధ్య, వారణాసి, నైమిశారణ్యం వెల్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ ఫ్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

Published : 17 Jul 2023 11:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీల (IRCTC Tour Package)ను అందిస్తోంది. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే కావాల్సిన ప్రాంతాన్ని చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలా ‘గంగా రామాయణ్‌ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్‌సీటీసీ పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. ఉత్తర భారతంలో పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, నైమిశారణ్య ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. పైగా విమాన ప్రయాణం ద్వారా చేరుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. 5 రోజుల పాటు సాగే ఈ టూర్‌ వివరాలు ఇప్పుడు చూద్దాం..

గంగా రామాయణ యాత్ర GANGA RAMAYAN YATRA యాత్ర పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 26, ఆగస్టు 9, 27 తేదీల్లో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, సారనాథ్‌, వారణాసి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. చివరి రోజు లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌ రావడంతో యాత్ర సంపూర్ణమవుతుంది.

విమాన ప్రయాణం ఇలా..

  • హైదరాబాద్‌ నుంచి ఉదయం 9:35 గంటలకు విమానం (6E- 915) బయల్దేరుతుంది. మధ్యాహ్నం 11:25 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. ముందే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. మధ్యాహ్న భోజనం ముగించుకొని కాశీ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత గంగా ఘాట్‌ సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఏర్పాటు చేస్తారు. వారణాసి ఘాట్‌కు చేరటానికి బస్సు సౌకర్యం ఉండదు. ఆటో, రిక్షాల్లో ప్రయాణించాల్సి వస్తే ఆ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం అల్పాహారం ముగించుకొని సారనాథ్‌కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం పూర్తిచేసుకొని మధ్యాహ్నం మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. తర్వాత ఘాట్ల సందర్శన, షాపింగ్‌ అనేది యాత్రికుల ఇష్టం. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి.
  • మూడో రోజు వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడి అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
  • నాలుగో రోజు అల్పాహారం ముగించుకొని అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్‌నవూ చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.
  • ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
  • ఆరో రోజు అల్పాహారం ముగించుకొని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ బారా ఇమాంబరను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్‌ చేరుకుంటారు. సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని హైదరాబాద్‌కు (6E – 278) పయనమవుతారు. 10:50  హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. 

ఇవి తప్పనిసరి

  • 75 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు ఎస్కార్ట్/కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లాలి.
  • విమాన ప్రయాణానికి 2 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఏదైనా కారణంతో యాత్రికులు ఫ్లైట్‌ను అందుకోకపోతే ఐఆర్‌సీటీసీ ఎటువంటి బాధ్యతా వహించదు.
  • ప్రయాణ పత్రాలతో పాటు 2 నుంచి 11 ఏళ్లున్న పిల్లలు వయస్సు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. 11 ఏళ్లు దాటిన వారిని పెద్దలుగా పరిగణిస్తారు.
  • ఐదు రోజుల పాటు అల్పాహారం, రాత్రి భోజనం, ఒక రోజు మధ్యాహ్న భోజనం మాత్రమే ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది.
  • మిగిలిన రోజుల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఇతర ఆహార పదార్థాలన్నీ యాత్రికులే చూసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
  • గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.

ప్యాకేజ్‌ ఛార్జీలు.. (ఒకరికి)

  • సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.33,900
  • ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.27,800
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.26,050
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.22,400, విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.22,150 చెల్లించాలి.
  • 2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.16,600 చెల్లించాలి.

క్యాన్సిలేషన్‌ ఛార్జీలు 

ఏదైనా కారణంతో విమాన ప్రయాణాన్ని క్యాన్సిల్‌ చేసుకోవాలనుకుంటే.. యాత్రకు 21 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే టికెట్‌ మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం; 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని