ఎడ్‌టెక్‌ కంపెనీల్లో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. వేదాంతు, లీడ్‌లో చెరో 100 మందికి ఉద్వాసన!

lay offs in Edtech firms: ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీలైన వేదాంతు, లీడ్‌ (లీడ్‌ స్కూల్‌) చెరో వంద మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Published : 05 Aug 2022 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: ఎడ్‌టెక్‌ (Edtech) కంపెనీల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో పాటు భౌతిక ట్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు కావడంతో కొవిడ్‌ సమయంలో ఆదరణ సంపాదించిన ఈ కంపెనీలకు ఆదరణ తగ్గింది. దీంతో ఆయా కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీలైన వేదాంతు, లీడ్‌ (లీడ్‌ స్కూల్‌) చెరో వంద మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

ఈ ఏడాది మే నెలలో 624 మంది ఉద్యోగులను తొలగించిన వేదాంతు.. తాజా ఉద్వాసనతో మొత్తం 724 మంది ఉద్యోగులను తొలగించినట్లయ్యింది. లేఆఫ్‌లు వేసిన ఉద్యోగులకు 2 నెలల వేతనాన్ని ఈ కంపెనీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలకు ముందు ఈ కంపెనీలో 5,900 మంది ఉద్యోగులు పనిచేసేవారు. మరో ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ ఏకంగా 40 శాతం సిబ్బందిని తగ్గించుకున్నట్లు వార్తలు రాగా.. దాన్ని కంపెనీ ఖండించింది. మొత్తం 2,200 మంది ఉద్యోగుల్లో 100 మంది మాత్రమే తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ ఏర్కొంది. పనితీరును సమీక్షించే ప్రక్రియ గత నెల పూర్తయ్యిందని, ఏటా ఇలా జరగడం సాధారణమని కంపెనీ పేర్కొంది. ఈ రెండు కంపెనీలే కాదు అన్‌ అకాడమీ, బైజుస్ సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని