logo

ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులనుంచి డబ్బు గుంజుతున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

Published : 04 Feb 2023 03:17 IST

బెంగళూరులో ఏపీ ముఠాకు కటకటాలు

గోపీచంద్‌, మంగారావు, షేక్‌, మహేశ్‌

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులనుంచి డబ్బు గుంజుతున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు శుక్రవారం వెల్లడించారు. విజయవాడకు చెందిన మల్లు శివశంకర్‌రెడ్డి అలియాస్‌ గోపీచంద్‌(26), గుంజ మంగారావు(35), ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్‌ శహబాషి (30), గుంటూరుకు చెందిన మహేశ్‌(21) అనే యువకులను అరెస్టుచేసినట్లు డీసీపీ డాక్టర్‌ అనూప్‌శెట్టి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. నమ్మిన హైదరాబాద్‌వాసి ప్రదీప్‌ మల్లు శివశంకర్‌రెడ్డి జనవరి 11న బెంగళూరులో వారిని కలిశాడు. వారు వచ్చిన కారు వివరాలను ఫొటో తీసుకున్నాడు. ఉద్యోగ పత్రాల కోసం రూ.30వేలివ్వాలని నిందితులు చెప్పగా, ప్రదీప్‌ గూగుల్‌ పే పనిచేయలేదు. నిందితులు అతడి ఫోన్‌ తీసుకుని పరిశీలించారు. కారు ఫొటో గుర్తించి.. ఎందుకు తీశావని దాడిచేసి, రూ.6 లక్షలు బలవంతంగా ఖాతాలో వేయించుకుని వెళ్లిపోయారు. ప్రదీప్‌ కోడిగెహళ్లి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో డొంకంతా కదిలింది. మల్లు శివశంకర్‌రెడ్డి మాన్యతా టెక్‌పార్కులోని ఓ ఐటీ సంస్థలో నకిలీ పత్రాల ఆధారంగా ఉద్యోగంలో చేరాడని గుర్తించి యాజమాన్యం తొలగించింది. అప్పటి నుంచి ఇలా మోసాలు మొదలుపెట్టాడని గుర్తించారు. అతడిని అరెస్టుచేయగా, మిగిలిన ముగ్గురి వివరాలూ బయటపడ్డాయి. వారినీ అరెస్టు చేశామని డీసీపీ వివరించారు.

మరో యువకుడు..

నకిలీ ఇన్‌స్టా ఖాతా ప్రారంభించి, యువతులకు ఉద్యోగాలపేరిట నమ్మించి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఆరోపణపై గుంటూరు యువకుడు, ఐటీ ఉద్యోగి ద్రిల్లీ ప్రసాద్‌(29)ను బెంగళూరు ఆగ్నేయ పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు. బాధితురాలైన ఓ యువతి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టుచేశామని నగర పోలీసు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని