logo

Hyderabad: సికింద్రాబాద్‌ దోపిడీ.. బంగారం కొట్టేశాక మహారాష్ట్ర చెక్కేశారు!

సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ మహారాష్ట్రకు చెందిన థానే ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Updated : 29 May 2023 08:29 IST

దోపిడీ జరిగిన నగల దుకాణం ఉన్న భవనం

ఈనాడు, హైదరాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే : సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ మహారాష్ట్రకు చెందిన థానే ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ గోల్డ్‌ షాప్‌లో ఐదుగురు అగంతుకులు ఐటీ అధికారులమంటూ జొరబడి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయిన ఘటన సంచలనం రేకెత్తించింది. సీసీకెమెరాల ఫుటేజ్‌తో నిందితులను గుర్తించారు. థానే ముఠాగా నిర్ధారణకు వచ్చారు. ఉత్తర మండలం డీసీపీ చందనాదీప్తి, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు సారథ్యంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. థానే పోలీసుల సహకారంతో ఆదివారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంటిదొంగల సహకారంతోనే బంగారం దోచుకెళ్లి ఉండొచ్చనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. దుకాణ యజమానులు, సిబ్బంది ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది. దొంగలు బసచేసిన లాడ్జి నిర్వాహకులను  విచారిస్తున్నారు.

ఏడుగురు వచ్చారు.. ముగ్గురు రెక్కీ చేశారు

నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠాలో 8 మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఈనెల 24న ఉదయం, మరో నలుగురు మధ్యాహ్నం బస్సులో నగరానికి చేరారు. ప్యాట్నీ సెంటర్‌లోని లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వీరిలో ఓ వ్యక్తి ఆధార్‌  నంబరును లాడ్జి నిర్వహకులకు ఇచ్చారు. గురు, శుక్రవారాలు బంగారు దుకాణం వద్ద  ముగ్గురు రెక్కీ నిర్వహించారు.  ఈనెల 27న ఐటీ అధికారులమంటూ ఐదుగురు రంగంలోకి దిగారు. ఓ వ్యక్తి దుకాణం బయట కాపలా ఉన్నాడు. మిగిలిన నలుగురు ముఖానికి మాస్క్‌లతో దుకాణంలోకి వెళ్లి కేవలం 15-20 నిమిషాల వ్యవధిలో 1700 గ్రాముల బంగారు బిస్కెట్లను చిన్న సంచిలో సర్దుకొని బయటకు వచ్చారు.  పాట్‌మార్కెట్‌ వెనుక మార్గం నుంచి రోడ్డుపైకి వచ్చి ఆటోలో జేబీఎస్‌ చేరారు. అక్కడ సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి మరో ఆటోలో ఐదుగురు కేపీహెచ్‌బీ బస్టాండుకు చేరారు. పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. ఆటోలో ప్రయాణించినవారు తెలుగు, హిందీ, మరాఠీలో మాట్లాడుకున్నారని ఆ డ్రైవర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు కేపీహెచ్‌బీ బస్టాప్‌ నుంచి మహారాష్ట్ర వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. లేదంటే వీరు కాజేసిన బంగారాన్ని బయట ఉన్న ముగ్గురి చేతికిచ్చి దారి మళ్లించారా..? ఆ ముగ్గురు ఎక్కడున్నారు అనే కోణాల్లోనూ వివరాలు రాబడుతున్నారు.

సహకరించిందెవరు?

పాట్‌ మార్కెట్‌లో పలు బంగారు దుకాణాలున్నాయి. నాలుగో అంతస్తులోని బాలాజీ గోల్డ్‌షాప్‌నే దొంగలు ఎంచుకోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తులతోనే థానే దొంగలు నగరం చేరారని, అసలు సూత్రధారి పథకం అమలుచేశాడని అంచనా. ఇంటిదొంగల సహకారం లేకుండా బంగారం చోరీ సాధ్యమయ్యే పని కాదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు