logo

Falaknuma Express: ప్రమాదం పసిగట్టి.. ప్రాణాలు నిలబెట్టి

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదంలో పలువురి ప్రాణాలు కాపాడాడు ఓ యువకుడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైను లాగి..

Updated : 10 Jul 2023 07:45 IST

ఫలక్‌నుమా ఘటనలో పలువురిని రక్షించిన రాజు

కుటుంబ సభ్యులతో రాజు

న్యూస్‌టుడే, జిన్నారం(ఐడీఏ బొల్లారం): ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదంలో పలువురి ప్రాణాలు కాపాడాడు ఓ యువకుడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైను లాగి.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఎంతో మంది ప్రాణాలను నిలిపాడు సిగిల్ల రాజు. పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారం పుర పరిధి లక్ష్మీనగర్‌లో కుటుంబీకులతో పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

ఒడిశాలోని పర్లాకిమిడికి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కాం. నేను, మా అమ్మ పార్వతి, చెల్లి పావని, పెద్దమ్మ బృందావతితో కలిసి ఎస్‌4 బోగిలో కూర్చున్నాం. ఉదయం 11 గంటల సమయంలో నేను పై బెర్తులో పడుకొని ఉండగా రబ్బరు కాలినట్లు వాసన వచ్చింది. పై నుంచి వేడి వస్తుంది. ఎండకు ఉండొచ్చని భావిస్తున్న సమయంలోనే వాసన మరింత ఎక్కువైంది. కిందికి దిగి కిటికీలోంచి చూడగా పొగ వస్తోంది. వెంటనే కేకలు వేశాను. చైన్‌ లాగినా రైలు పరిగెడుతూనే ఉంది. రెండోసారి గట్టిగా లాగితే రైలు ఆగింది. అప్పటికే ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం ఇచ్చాను. మా కుటుంబ సభ్యులను కిందికి దించాను. ఎందుకంటే ప్రమాద కేంద్రం మా బెర్తు వద్దనే ఉంది. మా మూడు బ్యాగులు, నగదు, సామగ్రి దగ్ధమయ్యాయి. తోటి ప్రయాణికులు కిందకు దిగడానికి సహకరించాను. ఇదే సమయంలో పొగలు, మంటలు ఎక్కువయ్యాయి. పొగను ఎక్కువగా పీల్చడంతో నేను స్పృహతప్పి పడిపోయాను. అక్కడికి వచ్చిన వారు మమ్మల్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు స్పృహలోకి వచ్చాను. రాత్రి 11 గంటలకు ఐడీఏ బొల్లారంలోని ఇంటికి చేరుకున్నాను. ప్రమాదాన్ని ముందే గుర్తించి కేకలు వేయటం, రైలు చైన్‌ లాగటం, అది ఆగటం, హాహాకారాలు చేస్తూ ప్రయాణికులు కిందకు దిగటం కొన్ని నిముషాల వ్యవధిలో జరిగిపోయింది. ఐదారు నిమిషాలు ఆలస్యమైనా తీవ్ర నష్టం జరిగేది. పొగ ఎక్కువగా పీల్చడంతో చాలా నీరసంగా ఉంది. ఛాతిలో నొప్పి వస్తోంది. చికిత్స కోసం ఏ అధికారి పట్టించుకోవటం లేదు. ఆ రోజు ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని