భారత్‌కు నీరవ్‌ మోదీ అప్పగింత: బ్రిటన్‌ ఓకే

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని

Updated : 23 Feb 2024 17:26 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ అంగీకరించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హోం మినిస్టర్‌ అంగీకారం తెలిపినట్లు సీబీఐ వెల్లడించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరి నెలలోనే అక్కడి కోర్టు తీర్పు ఇవ్వగా.. తాజాగా బ్రిటన్‌ హోంమంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో నీరవ్‌ మోదీని భారత్‌ రప్పించేందుకు మార్గం సుగమమయ్యింది.

దాదాపు రూ. 14వేల కోట్ల మోసం కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీ భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్‌ మోదీ బ్రిటన్‌ కోర్టుకు విన్నవించారు. అయితే, ఆయన చేసిన వాదనలను బ్రిటన్‌ కోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు అప్పగించినంత మాత్రన అన్యాయం జరగదన్న నీరవ్‌ వాదననూ  కోర్టు కొట్టిపారేసింది. మనీలాండరింగ్‌ విషయంలో భారత్‌ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని.. దీంతో భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరి నెలలో తీర్పు వెలువరించింది.

ఇక, తప్పుడు ఎల్‌వోయూలతో పీఎన్‌బీని నీరవ్‌ మోదీ మోసగించిన వైనం 2018 జనవరి వెలుగుచూసింది. దీంతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అదే ఏడాది రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్సమెంట్‌ డైరెక్టరేట్‌ ఈ కేసు దర్యాప్తులో భాగంగా నీరవ్‌కు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో నీరవ్‌ ఉంటున్నాడు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్‌ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. తాజాగా అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని