9 నెలల్లో సహారా డిపాజిటర్లకు నగదు

సహారా గ్రూప్‌ సంస్థ సెబీ వద్ద డిపాజిట్‌ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Published : 31 Mar 2023 01:13 IST

జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డికి పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలు
సెబీ-సహారా ఫండ్‌ నుంచి రూ.5,000 కోట్ల  చెల్లింపునకు సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: సహారా గ్రూప్‌ సంస్థ సెబీ వద్ద డిపాజిట్‌ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తుకు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల నేతృత్వంలోని ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ డబ్బు పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌.సుభాష్‌రెడ్డికి అప్పగించింది. ఈ విషయంలో జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీకి సాయం చేయడానికి న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ను అమైకస్‌ క్యూరీగా నియమించింది. ఇందుకు గాను జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డికి నెలకు రూ.15 లక్షలు, న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌కు రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సహారా-సెబీ రీఫండ్‌ అకౌంట్‌లో ఉన్న రూ.24,979.67 కోట్లలో రూ.5,000 కోట్లను సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌కు బదిలీచేయాలని, ఆ మొత్తాన్ని వారు సహారా గ్రూప్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌లో ఉన్న చట్టబద్ధమైన డిపాజిటర్‌దారులకు చెల్లించాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ చెల్లింపులు అత్యంత పారదర్శకమైన పద్ధతిలో, తగిన గుర్తింపు విధానం ద్వారా జరగాలని పేర్కొంది. డిపాజిటర్‌దారులు వారి గుర్తింపు పత్రంతోపాటు, ఇందులో తాము డిపాజిట్‌చేసినట్లు నిరూపించే పత్రాలు సమర్పించిన తర్వాత వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. చెల్లింపులు ఎలా చేయాలన్నదానిపై జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌లను సంప్రదించిన తర్వాత సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ విధివిధానాలను ఖరారుచేయాలని పేర్కొంది. ఈ రూ.5,000 కోట్ల మొత్తాన్ని నిజమైన డిపాజిట్‌దారులకు 9 నెలల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఏదైనా మొత్తం మిగిలితే దాన్ని మళ్లీ సహారా-సెబీ రీఫండ్‌ ఖాతాకు మళ్లించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని