లో వోల్టేజ్‌ మోటార్స్‌, గేర్స్‌ వ్యాపారాన్ని విక్రయిస్తోన్న సీమెన్స్‌

సీమెన్స్‌ ఏజీ అనుబంధ సంస్థ సీమెన్స్‌ లార్జ్‌ డ్రైవ్స్‌ ఇండియాకు లో వోల్టేజ్‌ మోటార్స్‌, గేర్డ్‌ మోటార్స్‌ వ్యాపారాన్ని సీమెన్స్‌ విక్రయించనుంది.

Published : 20 May 2023 02:43 IST

దిల్లీ: సీమెన్స్‌ ఏజీ అనుబంధ సంస్థ సీమెన్స్‌ లార్జ్‌ డ్రైవ్స్‌ ఇండియాకు లో వోల్టేజ్‌ మోటార్స్‌, గేర్డ్‌ మోటార్స్‌ వ్యాపారాన్ని సీమెన్స్‌ విక్రయించనుంది. లావాదేవీ విలువ రూ.2,200 కోట్లు. ఇందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిపాదిత వ్యాపారాల బదిలీ, విక్రయం 2023 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే ఇరు పక్షాల నిర్దేశించుకున్న షరతుల పాటింపు, వాటాదార్లు, నియంత్రణ సంస్థల ఆమోదంపై ఈ లావాదేవీ పూర్తి కావడం ఆధారపడి ఉంటుంది. 2021-22లో సీమెన్స్‌ లో వోల్టేజ్‌ మోటార్స్‌, గేర్డ్‌ మోటార్స్‌ వ్యాపారం రూ.1,061 కోట్ల కార్యకలాపాల ఆదాయాన్ని, రూ.132 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ మొత్తం ఆదాయంలో ఈ వ్యాపార ఆదాయ వాటా 7 శాతం కాగా.. లాభం వాటా 9 శాతం.


బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ గెలాక్సీ సూపర్‌ సేల్‌

హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ సంస్థ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ గెలాక్సీ సూపర్‌ సేల్‌ను ప్రకటించింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను ఈనెల 28 వరకు రాయితీ ధరలపై విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా శామ్‌సంగ్‌ గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 4ను రూ.1,21,999, గెలాక్సీ ఎస్‌23 అల్ట్రాను రూ.84,999కు పొందే వీలుంటుంది. గెలాక్సీ ఎల్‌22 అల్ట్రా రూ.63,999కు, గెలాక్సీ ఎస్‌22 రూ.30,999కు, గెలాక్సీ ఎస్‌23 మోడల్‌ను రూ.42,499 నుంచి పొందొచ్చు. పాత మొబైల్‌ మార్చుకుని, కొత్తది కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు బోనస్‌ అదనంగా లభిస్తుందని సంస్థ తెలిపింది.  


తగ్గిన జొమాటో నష్టం

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో జొమాటో ఏకీకృత ప్రాతిపదికన రూ.187.60 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.359.70 కోట్లతో పోలిస్తే నష్టం భారీగా తగ్గడం గమనార్హం. కార్యకలాపాల ఆదాయం రూ.1,211.80 కోట్ల నుంచి పెరిగి రూ.2,056 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జొమాటో రూ.971 కోట్లు కాగా.. 2021-22లో నమోదైన రూ.1,222.50 కోట్లతో పోలిస్తే తగ్గింది. ఏకీకృత ఆదాయం రూ.4,192.40 కోట్ల నుంచి పెరిగి రూ.7,079.40 కోట్లకు చేరింది. ఆహార ఆర్డర్లు, డెలివరీ వ్యాపారానికి రాకేశ్‌ రంజన్‌ను సీఈఓగా నియమించినట్లు జొమాటో తెలిపింది. సీఓఓగా రిన్షుల్‌ చంద్రా వ్యవహరిస్తారని పేర్కొంది. జొమాటో హైపర్‌ప్యూర్‌కు సీఈఓగా రిషి అరోరాకు బాధ్యతలు అప్పగించినట్లు వివరించింది.


ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌

ముంబయి: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రూ.87,416 కోట్ల డివిడెండ్‌ చెల్లించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. 2021-22లో చెల్లించిన రూ.30,307 కోట్ల డివిడెండ్‌తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 3 రెట్లు అధికం కావడం గమనార్హం. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ బోర్డు డైరెక్టర్ల 602వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023-23 సాధారణ బడ్జెట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.48,000 కోట్లను ప్రభుత్వం ఆశిస్తోంది. 2022-23లో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు రూ.లక్ష కోట్లను మించడంతో, ప్రభుత్వ రాబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2021-22కు సంబంధించి ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ.40,953 కోట్లు లభించాయి. 2022-23 బడ్జెట్‌ అంచనా రూ.73,948 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని