Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 18,600 దిగువకు నిఫ్టీ

Stock Market: ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 251 పాయింట్ల నష్టంతో 62,718 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 73 పాయింట్లు కుంగి 18,560 దగ్గర కొనసాగుతోంది.

Published : 31 May 2023 09:42 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 251 పాయింట్ల నష్టంతో 62,718 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 73 పాయింట్లు నష్టపోయి 18,560 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు కుంగి 82.73 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, టైటన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రస్తుతం యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అప్పుల పరిమితి పెంపు బిల్లు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఓటింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మార్కెట్లలో అప్రమత్తత కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే కారణంతో బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 4 శాతానికి పైగా తగ్గి 73.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఐరోపా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.2,085 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.439 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

  • ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ స్టాండర్డ్‌ ఇండెక్స్‌ పునర్‌వ్యవస్థీకరణ ఈరోజు జరగనుంది. అందులో భాగంగా సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెయిటేజీ రెట్టింపు కానున్నట్లు సమాచారం. మరోవైపు అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, ఇండస్‌ టవర్స్‌ సూచీ నుంచి బయటకు రానున్నాయి. వాటి స్థానంలో మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌, హెచ్‌ఏఎల్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ సూచీలో చేరనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
  • కోల్‌ ఇండియా: నాన్‌- కోకింగ్‌ కోల్‌ ధరల్ని 8 శాతం పెంచడానికి కోల్‌ ఇండియా బోర్డు ఆమోదం తెలిపింది. కొత్త ధరలు మే 31 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీకి అదనంగా రూ.2,703 కోట్ల ఆదాయం లభించనున్నట్లు తెలుస్తోంది.
  • అపోలో హాస్పిటల్స్‌: మార్చి 31, 2023తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఏకీకృత నికర లాభం 60 శాతం పెరిగి రూ.144 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల్లోనూ బలమైన పనితీరు కనిపించడం ఇందుకు దోహదం చేసింది. 2021-22 జనవరి-మార్చి త్రైమాసికంలో నికర లాభం రూ.90 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం సైతం రూ.3,546 కోట్ల నుంచి రూ.4,302 కోట్లకు పెరిగిందని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.
  • పతంజలి ఫుడ్స్‌: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,676.19 కోట్ల నుంచి రూ.7,962.95 కోట్లకు పెరిగింది.
  • అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌: మార్చి త్రైమాసికానికి రూ.1140.97 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.1111.63 కోట్ల కంటే ఇది 2.63% ఎక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.4739.08 కోట్ల నుంచి రూ.6179.12 కోట్లకు పెరిగింది.
  • రాంకీ ఇన్‌ఫ్రా: మౌలిక వసతుల నిర్మాణ రంగ సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. త్రైమాసిక ఆదాయం రూ.600.99 కోట్లు, పన్నుకు ముందు లాభం రూ.19.49 కోట్లను ఆర్జించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు