logo

సినిమాలు చూసి.. ఐటీ అధికారుల వేషం వేసి..

సికింద్రాబాద్‌ పాట్‌మార్కెట్‌లోని నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన 10 మంది సభ్యులున్న ముఠాలో నలుగురు నిందితులను ఉత్తర మండలం, మార్కెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 31 May 2023 04:34 IST

నగల దోపిడీ కేసులో నలుగురు అరెస్టు

అధికారులను అభినందిస్తున్న సీపీ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పాట్‌మార్కెట్‌లోని నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన 10 మంది సభ్యులున్న ముఠాలో నలుగురు నిందితులను ఉత్తర మండలం, మార్కెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పథకం ప్రకారమే ఇంటిదొంగ ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారుల వేషంలో వచ్చి బంగారం మాయం చేసినట్టు గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో ఉత్తరమండలం డీసీపీ చందనాదీప్తి, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, మహంకాళి ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్‌రావు, శ్రీనాథ్‌రెడ్డితో కలిసి సీపీ సీవీ ఆనంద్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. వికాస్‌ కదేకర్‌కు దిల్‌సుఖ్‌నగర్‌లో సిద్ధివినాయక బంగారు దుకాణం ఉంది. చిక్కడపల్లి, పాట్‌మార్కెట్‌లో ముడిసరకును కరిగించే 2 వర్క్‌షాపులున్నాయి. మహారాష్ట్ర ఖానాపూర్‌కు చెందిన జకీర్‌ ఘని అత్తర్‌(35) నగరానికి వచ్చి కదేకర్‌ దుకాణాల్లో ఆభరణాల లావాదేవీలు పరిశీలించాడు. బంగారం కరిగించటంలో అనుభవం ఉండటంతో పాట్‌మార్కెట్‌లోని హర్షద్‌ దుకాణంలో పనికి కుదిరాడు. ముడిబంగారం వర్క్‌షాప్‌నకు చేరగానే కొట్టేసేందుకు ఎత్తువేశాడు. పథకాన్ని స్నేహితులు రహ్మాన్‌ గఫూర్‌ అత్తర్‌(30), ప్రవీణ్‌యాదవ్‌(32), అశోక్‌ అరుణ్‌ హొవిలి(31), అబిజిత్‌కుమార్‌(28), అమోల్‌ గణపార్దవ్‌ జాదేవ్‌(25), సంజయ్‌పరశురామ్‌ జాదవ్‌(27), గోవాలోని సిద్ధనాథ్‌(25), శుభం వినోద్‌ జాదవ్‌(27), అజయ్‌ వినోద్‌ జాదవ్‌(28)తో పంచుకున్నాడు.

లాడ్జీల్లో వేర్వురు గదుల్లో బస: జకీర్‌ సూచనతో ఖానాపూర్‌, గోవాలో ఉన్న 9 మంది ఈనెల 24న బస్సు, రైలు మార్గాల్లో సికింద్రాబాద్‌ చేరారు. ప్యాట్నీసెంటర్‌లో దిల్లీ లాడ్జిలో బసచేశారు. స్పెషల్‌ 26, గ్యాంగ్‌ సినిమాలు చూశారు. సినిమాలో మాదిరిగా ఐటీ అధికారుల పేరిట నకిలీ ఐడీకార్డులు తయారు చేయించారు. 27న ఉదయం ఐదుగురు నిందితులు నవకేతన్‌ కాంప్లెక్స్‌లోని సిద్ధివినాయక దుకాణంలోకి ప్రవేశించారు. ఐటీ అధికారులమంటూ బెదిరించి సిబ్బంది ఫోన్లు లాక్కొని గదిలో బంధించారు. 1700 గ్రాముల 17 బంగారు బిస్కెట్లు తీసుకొని పారిపోయారు.

100కుపైగా సీసీ కెమెరాల పరిశీలన

సీపీ సీవీ ఆనంద్‌ కేసును స్వయంగా పర్యవేక్షించారు. లాడ్జిలో ఇచ్చిన ఒకరి ఆధార్‌కార్డు ఆధారంగా వేట ప్రారంభించారు. 100కుపైగా సీసీ ఫుటేజీ సేకరించారు. రెహ్మాన్‌ గఫూర్‌ అత్తర్‌, జకీర్‌ ఘని అత్తర్‌, ప్రవీణ్‌యాదవ్‌, అకాష్‌ అరుణ్‌ను అరెస్ట్‌ చేసి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్‌కుమార్‌, సిద్ధనాథ్‌, సంజయ్‌, అజయ్‌, వినోద్‌జాదవ్‌ కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని