ఈ మెగా డేట్స్‌.. గుర్తుపెట్టుకోండి!

‘కొన్ని సార్లు రావడం లేటు అవ్వొచ్చు. కానీ, రావడం మాత్రం పక్కా’. ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్‌కల్యాణ్ డైలాగ్‌

Updated : 02 Feb 2021 17:10 IST

2021లో థియేటర్‌లలో సందడి చేయనున్న మెగా హీరోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కొన్ని సార్లు రావడం లేటు అవ్వొచ్చు. కానీ, రావడం మాత్రం పక్కా’. ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్‌కల్యాణ్ డైలాగ్‌ ఇది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అటు అగ్ర కథానాయకుల నుంచి ఇటు యువ కథానాయకుల వరకూ అందరి పరిస్థితి ఇదే. ఎందుకంటే కరోనా కారణంగా గతేడాది దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సీజన్‌తో సినిమాల విడుదల ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హీరోలందరూ తాము చేస్తున్న చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సినీ అభిమానులకు ప్రతి నెలా ఇక పండగే. అయితే, ఈ ఏడాది ఓ ఆసక్తికర విషయం అందరినీ అలరించనుంది. అదేంటంటే ‘మెగా ఫ్యామిలీ’లోని హీరోలందరి చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరి చిత్రాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. మరి ఎవరెవరు? ఎప్పుడు? ఏ సినిమాతో వస్తున్నారో ఓ లుక్కేద్దామా!

‘ఉప్పెన’తో మొదలు..

మెగా కుటుంబం నుంచి ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించే యువ హీరో వైష్ణవ్‌ తేజ్‌. బుచ్చి బాబు దర్శకత్వంలో వైష్ణవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. గతేడాది విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మెగా కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయమవుతుండటం, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించడం, దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

థియేటర్‌ దద్దరిల్లేలా ‘వకీల్‌సాబ్’

ఈ ఏడాది పవన్‌కల్యాణ్‌ అభిమానులకు పండగే. ఎందుకంటే ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. రాజకీయాలతో తీరికలేకుండా గడిపిన పవన్‌ మళ్లీ ‘వకీల్‌సాబ్’తో కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ కథానాయిక. ‘పింక్‌’ రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ వస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రానాతో కలిసి ఆయన నటిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ చిత్రం కూడా ఈ ఏడాదే రావొచ్చు. సాగర్‌ కె.చంద్ర దీనికి దర్శకుడు.

గుణ పాఠాలు చెప్పేందుకు వస్తున్న ‘ఆచార్య’

‘పాఠాలు చెప్పే ఆచార్య కాదు.. గుణపాఠాలు చెబుతా’ అంటూ ఇటీవల టీజర్‌తో దుమ్మురేపారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మరోవైపు ఇటీవల విడుదల చేసిన టీజర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ‘ఆచార్య’ను ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణెదల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఆచార్య’కు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

‘రిపబ్లిక్‌’తో సాయితేజ్‌

గతేడాది ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటూ నవ్వులు పంచారు సాయితేజ్‌. ఆయన కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఇటీవల విడుదల చేసిన చిత్ర మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాగా, జూన్‌ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రయోగాత్మ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దేవ్‌ కట్టా ఈ సినిమాలో సాయితేజ్‌ను ఎలా చూపిస్తారో చూడాలి. ఐశ్వర్యరాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వరుణ్‌ డబుల్‌ ధమాకా

తొలి నుంచి విభిన్న కథలు, పాత్రలు ఎంచుకుంటున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఈసారి ఆయన బాక్సర్‌ అవతారం ఎత్తారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌ నటిస్తున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జులై 30న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా విడుదలై నెల రోజులు పూర్తి కాకుండానే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వరుణ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఎఫ్‌2’. 2019లో వచ్చిన ఈ సినిమా కడుపుబ్బా నవ్వించింది. దీనికి కొనసాగింపుగా ‘ఎఫ్‌3’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పట్టాలెక్కిన ఈ సినిమాను ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పాన్‌ ఇండియా ‘పుష్ప’

గతేడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్ని ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన లుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. తెలుగుతో పాటు దాదాపు 5 భాషల్లో ‘పుష్ప’ను విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. చారిత్రక పాత్రలకు కల్పితగాథను జోడించి జక్కన్న ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌.. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఆ మూడు సినిమాల విడుదల తేదీ ఒకటే!

ఇలా మెగా హీరోలందరూ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, వీరు నటిస్తున్న సినిమాల్లో ముగ్గురు హీరోల సినిమాలకు ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. చిరు ‘ఆచార్య’ మే 13న రానుండగా, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ ఆగస్టు 13న, రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అక్టోబరు 13న వస్తుండటం విశేషం. ఇలా ఈ మూడు సినిమాలు విడుదలయ్యే నెలలు వేరైనా 13వ తేదీనే వస్తుండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని