భూమి ‘జ్వరం’ తానే తగ్గించుకుంటుంది!

పెరుగుతున్న భూతాపంతో పరిస్థితి ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే భూమి రంగంలోకి దిగుతుంది. పరిస్థితి పూర్తిగా చేజారి పోతోందని అనిపించినప్పుడు సిలికేట్‌ క్షీణత ప్రక్రియతో తనను తాను సరిదిద్దుకుంటుంది.

Published : 23 Nov 2022 00:47 IST

పెరుగుతున్న భూతాపంతో పరిస్థితి ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే భూమి రంగంలోకి దిగుతుంది. పరిస్థితి పూర్తిగా చేజారి పోతోందని అనిపించినప్పుడు సిలికేట్‌ క్షీణత ప్రక్రియతో తనను తాను సరిదిద్దుకుంటుంది.

జ్వరం వచ్చినప్పుడు ఒంటికి చెమట పడుతుంది. తర్వాత జ్వరం తగ్గుతుంది. ఉష్ణోగ్రతను తగ్గించుకోవటానికి మన శరీరం చేసే ప్రయత్నమిది. మనలాగే భూమి సైతం తన ఉష్ణోగ్రతను తానే నియంత్రించు కుంటుందంటే నమ్ముతారా? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనం గురించి తెలిస్తే దీన్ని నమ్మి తీరాల్సిందే. స్థిరీకరణకు అవసరమైన సమాచార యంత్రాంగం భూమికి ఉన్నట్టు ఇది నిర్ధారించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటానికి ముందే వాతావరణాన్ని ఈ యంత్రాంగం తిరిగి స్థిరీకరించుకుంటుందని, ఇందుకు లక్షలాది ఏళ్లు పడుతుందని పేర్కొంది. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలను జీవుల ఆవాసానికి తగినంత స్థాయిలో ఉండేలా భూమి తనకు తానే కాపాడుకుంటుందన్నమాట. అయితే అప్పుడే అంత ఎగిరి గంతేసియాల్సిన పనిలేదు. మనం ఇప్పటికే భూమికి కోలుకోలేని నష్టాన్ని కలిగించాం. విపత్తుల రూపంలో దాని పర్యవసానాలనూ అనుభవిస్తున్నాం. ఇప్పటి కిప్పుడు దీన్ని సరిదిద్దుకునే అవకాశమైతే లేదు. కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం అంతంతే. ఎప్పుడైనా పరిస్థితి అదుపు తప్పొచ్చు. భూమి కూడా అలాంటి పరిస్థితుల్లోనే రంగంలోకి దిగుతుంది. పరిస్థితి అదుపు తప్పుతోంది, పూర్తిగా చేజారి పోతోందని అనిపించి నప్పుడు తనను తాను సరిదిద్దుకుంటుంది. ఇంతకీ దీన్నెలా సాధిస్తుంది? ఇందుకు ‘సిలికేట్‌ క్షీణత’ దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. ఖనిజాలు రసాయనికంగా క్షీణించే క్రమంలో కొత్త ఖనిజాలుగా, ఖనిజ ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతాయి. హేలైట్‌, కాల్సైట్‌ వంటి ఖనిజాలైతే పూర్తిగా కరిగిపోతాయి కూడా. ఇతరత్రా ఖనిజాలు.. ముఖ్యంగా సిలికేట్‌ ఖనిజాలు హైడ్రాలిసిస్‌ అనే రసాయనిక చర్యతో మారిపోతాయి. ఇది నెమ్మదిగా సాగే ప్రక్రియ. వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌, ఉపరితల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీటి రసాయన క్షీణత వేగం పుంజుకుంటుంది. అప్పుడు వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను మరింత ఎక్కువగా సంగ్రహిస్తాయి. ఇది సిలికాన్‌ రాళ్లలో నిక్షిప్తమవుతుంది. ఫలితంగా వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇలా ప్రపంచ ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తుంటాయి. ఇలా గత 66 కోట్ల కాలంలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వీటికి గణిత సూత్రాలను అన్వయించి స్థిరీకరణ ప్రక్రియ తీరును అంచనా వేశారు. లక్షలాది ఏళ్ల కాలానికి ఓసారి భూమి అత్యంత అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నట్టు గుర్తించారు. వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారిపోయినా, చాలాసార్లు మహా అంతర్థానాలు సంభవించినా జీవజాతులను భూమి ఎలా కాపాడుకోగలుగుతోందనే రహస్యాన్ని ఇది విప్పి చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని