మహిళా సంపన్నురాలు రోష్ని నాడార్‌

దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకుందని కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌-హురున్‌

Updated : 28 Jul 2022 13:57 IST

నాలుగో స్థానంలో దివీస్‌ నీలిమ
టాప్‌-100లో అపోలో నుంచి నలుగురు

ముంబయి: దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకుందని కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌-హురున్‌ విడుదల చేసిన జాబితా తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వృత్తిజీవితాన్ని వదులుకుని, పదేళ్ల కిందట నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌ సొంతంగా ఎదిగిన మహిళల్లో అగ్రపీఠాన్ని అధిరోహించారు. ఒక్క ఏడాదిలో నాయర్‌(59) సంపద ఏకంగా 963 శాతం పెరిగి రూ.57,520 కోట్లకు చేరుకుంది. మహిళా సంపన్నుల మొత్తం జాబితాలో రెండో స్థానం ఈమెదే. ‘బయోకాన్‌’ కిరణ్‌ మజుందార్‌ షా నికర సంపద 21 శాతం తగ్గి రూ.29,030 కోట్లకు చేరుకోవడంతో ఒక స్థానం తగ్గి మూడో ర్యాంకుకు పరిమితం అయ్యారు. నాలుగో స్థానంలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ శాశ్వత  డైరెక్టర్‌ (కమర్షియల్‌) నీలిమ ప్రసాద్‌(రూ.28,180 కోట్లు) నిలిచారు.

* భారత్‌లో పుట్టి లేదా పెరిగిన 100 మంది మహిళా సంపన్నులతో ఈ జాబితా సిద్ధం చేశారు. వీరి మొత్తం సంపద 2020లో రూ.2.72 లక్షల కోట్లు ఉండగా.. 2021 నాటికి 53 శాతం వృద్ధితో రూ.4.16 లక్షల కోట్లకు చేరుకుంది. భారత జీడీపీలో ఇది 2 శాతానికి సమానం.

* జాబితా టాప్‌-100లో చేరడానికి కనీస సంపద పరిమితి రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెరిగింది. అగ్రగామి-10 మందిలో చేరేందుకు, పరిమితి 10 శాతం పెరిగి రూ.6620 కోట్లకు చేరుకుంది.

* దిల్లీ ఎన్‌సీఆర్‌ నుంచి అత్యధికంగా 25 మంది సంపన్నురాళ్లు జాబితాలో చోటు చేసుకోగా.. ముంబయి(21), హైదరాబాద్‌(12)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌ నుంచే నలుగురు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

* తొలి 100 మందిలో ఔషధ రంగం నుంచి 12 మంది; ఆరోగ్య సంరక్షణ విభాగంలో 11 మంది; వినియోగదారు వస్తువుల రంగం నుంచి 11 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని