దీర్ఘకాలిక మదుపరులకు..

బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా వాల్యూ ఫండ్‌ను తీసుకొచ్చింది. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ వాల్యూ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 31. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి

Updated : 19 May 2023 09:05 IST

బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా వాల్యూ ఫండ్‌ను తీసుకొచ్చింది. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ వాల్యూ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 31. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఈ పథకానికి శివ్‌ చనాని ఫండ్‌ మేనేజర్‌. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ వాల్యూ ఫండ్‌ పనితీరుకు నిఫ్టీ 500 ఇండెక్స్‌ను కొలమానంగా తీసుకుంటారు.

వాల్యూ ఫండ్‌ సాధారణంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే మదుపరులకు అనువుగా ఉంటుంది. ప్రధానంగా విలువ ఆధారంగా కంపెనీలను ఎంచుకొని, వాటితో పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. మొత్తం సొమ్ములో కనీసం 65 శాతాన్ని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడతారు. రుణ పత్రాలకు 35 శాతం వరకూ కేటాయించే అవకాశం ఉంది. కొంత సొమ్మును రీట్‌, ఇన్విట్‌లకు, మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయటానికి కేటాయిస్తారు. ఫలానా మార్కెట్‌ క్యాప్‌ లేదా ఫలానా రంగానికి చెందిన కంపెనీల షేర్లలోనే పెట్టుబడి పెట్టాలనే నియమం ఏదీ వాల్యూ ఫండ్లకు ఉండదు. మంచి కొనుగోలు విలువ కనిపిస్తుంటే, అదీ తక్కువ ధరలో లభిస్తుంటే, ఆ సంస్థను పెట్టుబడి కోసం ఎంచుకుంటారు.


ఆకర్షణీయమైన వ్యాపారాల్లో..

వివిధ విభాగాల్లో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు నిర్వహిస్తూ అకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఆర్జిస్తున్న క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘క్వాంట్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. సెక్టోరియల్‌/ థీమాటిక్‌ విభాగానికి చెందిన ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 25. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. సందీప్‌ టాండన్‌, అనికిత్‌ పాండే, సంజీవ్‌ శర్మ, వాసవ్‌ సహగల్‌ ఫండ్‌ మేనేజర్లు. నిఫ్టీ 500 టీ¨ఆర్‌ఐ ఇండెక్స్‌ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.

ఒక్కోసారి ఒక్కో వ్యాపార రంగం మెరుగైన పనితీరును కనబరుస్తూ ఉంటుంది. ఆ తరుణంలో ఆ వ్యాపార విభాగానికి చెందిన కంపెనీలు మంచి పనితీరు సాధిస్తాయి. దానివల్ల స్టాక్‌మార్కెట్లో ఆ కంపెనీల షేర్ల ధరలు పెరుగుతాయి. ఇటువంటి అవకాశాలను గుర్తించి పెట్టుబడి పెట్టటం ద్వారా అధిక లాభాలను ఆర్జించేందుకు ప్రయత్నించే పథకాన్ని బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ అంటారు. ఇలాంటి పథకాల్లో ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని సాధించేందుకు దీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. అందువల్ల స్వల్ప, మధ్యకాలంలో మంచి లాభాలు ఆశించే వారికి ఇవి సరిపోవు. అంతేగాక వ్యాపార రంగంలో వస్తున్న మార్పులను ఫండ్‌ మేనేజర్‌ సరిగా అంచనా వేయగలగాలి. లేనిపక్షంలో ఎంచుకున్న వ్యాపార రంగం వెనుకే ఉండిపోయి, ఇతర రంగాలు ముందుకు వెళ్లి, ఫండ్‌ పనితీరు నిరుత్సాహకరంగా మారుతుంది. అదే సమయంలో ఫండ్‌ మేనేజర్‌ అంచనాలు సరైనవి అయితే అనూహ్యమైన లాభాలు వస్తాయి. అందువల్ల మదుపరులు ఈ తరహా పథకాల్లో ఉన్న మంచి చెడులను విశ్లేషించి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.


దేశీయ రక్షణ రంగంలో..

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, వినూత్నమైన రీతిలో ‘హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్‌ ఫండ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇటీవలి కాలంలో రక్షణ (డిఫెన్స్‌) రంగానికి చెందిన కంపెనీలకు అధికంగా కాంట్రాక్టులు, వ్యాపార అవకాశాలు లభిస్తున్న విషయం విదితమే. దీంతో ఆయా కంపెనీలు అధిక లాభాలు ఆర్జిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లో డిఫెన్స్‌ ఉత్పత్తుల కంపెనీల షేర్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇదే ధోరణి వచ్చే కొన్నేళ్ల పాటు కనిపించే అవకాశం ఉందని అంచనా. ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్‌ ఫండ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ రూపొందించింది.

* ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 2.

* దీనికి అభిషేక్‌ పొద్దార్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

* ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌, షిప్‌ బిల్డింగ్‌ రంగాలకు చెందిన కంపెనీలను ఎంచుకొని ఈ పథకం పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు.

* ఎస్‌ఐడీఎం (సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌) జాబితాలో ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తారు.

* కనీసం 10 శాతం ఆదాయాన్ని డిఫెన్స్‌ ఉత్పత్తులు, సేవల నుంచి ఆర్జిస్తున్న కంపెనీలనూ పరిగణనలోకి తీసుకుంటారు.

దేశీయ మ్యూచువల్‌ ఫండ్ల మార్కెట్లో డిఫెన్స్‌ పథకం అనేది కొత్తదిగా చెప్పుకోవచ్చు. కేవలం డిఫెన్స్‌ రంగానికి చెందిన కంపెనీలపైనే పెట్టుబడి పెట్టే ఫండ్లు ఇంతవరకూ అందుబాటులో లేవు. అందువల్ల హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్‌ ఫండ్‌, పనితీరు ఎలా ఉంటుందనే విషయంలో సరైన అంచనాలు లేవు. కానీ దేశీయ రక్షణ తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆకర్షణీయమైన లాభాలు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. దీన్ని విశ్వసించే మదుపరులు ఈ పథకాన్ని పెట్టుబడి కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని