Payal Rajput: అల్లు అర్జున్‌.. అలా చేయడం తేలిక కాదన్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన సినిమా ‘మంగళవారం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న పాయల్‌.. అల్లు అర్జున్‌ గురించి మాట్లాడారు.

Published : 15 Nov 2023 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనతో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) మాట్లాడిన మాటలకు చాలా ఆనందించానని హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) తెలిపారు. తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. పాయల్‌, ‘రంగం’ ఫేమ్‌ అజ్మల్‌ అమీర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఈ సినిమా నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించింది. ఆ వేడుకకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. వేదికపైకి వెళ్లక ముందు పాయల్‌తో అల్లు అర్జున్‌ ముచ్చటించారు. స్టేజ్‌పైన పాయల్‌ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ సంగతులు గుర్తుచేస్తూ.. ‘అర్జున్‌ మీతో ఏం మాట్లాడారు?’ అని విలేకరులు ప్రశ్నించగా పాయల్‌ స్పందించారు. ‘‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమాలో నువ్వు పోషించిన పాత్ర గురించి నాకు తెలుసు. ఆ క్యారెక్టర్‌ ప్లే చేయడం అంత తేలిక కాదు’’ అని అర్జున్‌ ప్రశంసించినట్లు పాయల్‌ తెలిపారు. ఆమె పంచుకున్న మరికొన్ని విశేషాలివీ..

అలాంటి సన్నివేశాలు నా జీవితంలో తీయను!

‘‘ఈ సినిమాలో నేను పోషించిన శైలజ పాత్రకు, నా నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు కొంత రీసెర్చ్‌ చేశా. మేకప్‌ కోసం సుమారు రెండు గంటల సమయం వెచ్చించాల్సి వచ్చేది. చిత్రీకరణ పూర్తయిన కొన్ని రోజుల వరకు ఆ క్యారెక్టర్‌ నుంచి బయటకు రాలేకపోయా. నాకంటే ముందు దాదాపు 35 మందిని ఈ రోల్‌ కోసం ఆడిషన్‌ చేశారు. నాకు అవకాశం ఇవ్వండని దర్శకుడిని అడిగితే ఆడిషన్‌ చేసి తీసుకున్నారు’’ అని తెలిపారు. తన తొలి తెలుగు సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా హీరో కార్తికేయ గురించి మాట్లాడుతూ.. ‘‘మళ్లీ మనం కలిసి ఓ సినిమా చేద్దామని కార్తికేయతో చెప్పా. మంచి కథ వస్తే తప్పకుండా నటిద్దామని ఆయన అన్నారు’’ అని పాయల్‌ చెప్పారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’కు అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని