Apple: ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.. కిరాయి స్పైవేర్‌తో లక్షిత సైబర్‌దాడులు!

Apple: సైబర్‌దాడులపై ఎప్పటికప్పుడు తమ యూజర్లను అప్రమత్తం చేసే యాపిల్‌ తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్‌తో కొందరు దుండగులు డివైజ్‌లలోకి చొరబడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Updated : 11 Apr 2024 11:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ (Apple) తమ థ్రెట్‌ నోటిఫికేషన్‌ వ్యవస్థను అప్‌డేట్‌ చేసింది. ‘కిరాయికి తీసుకున్న స్పైవేర్‌’ ద్వారా లక్షిత సైబర్‌ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌ (iPhone) సహా యాపిల్‌ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ‘ఎఫ్‌ఏక్యూ (FAQs)’లో పేర్కొంది. ఈ మేరకు త్వరలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌ పంపే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తయారు చేసిన పెగాసస్‌ వంటి వాటిని ‘కిరాయి స్పైవేర్‌’ (mercenary spyware)గా వ్యవహరిస్తుంటారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వీటితో ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను మాత్రమే లక్ష్యం చేసుకుంటారు. సమాజంలో సదరు వ్యక్తుల పాత్ర, హోదా, స్థాయి ఆధారంగా ఎవరిని టార్గెట్‌ చేయాలనేది సైబర్‌ నేరగాళ్లు నిర్ణయిస్తారని యాపిల్‌ చివరిసారి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు వివరించింది. ఇప్పటి వరకు వీటిని ‘ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్‌ దాడులు’గా పేర్కొన్న సంస్థ.. వాటిని ఇప్పుడు ‘కిరాయి స్పైవేర్‌ ముప్పు’గా మార్చడం గమనార్హం.

ఇప్పటికే మెర్సినరీ స్పైవేర్‌ ద్వారా పలువురి ఐఫోన్‌ (iPhone) సహా ఇతర ఉత్పత్తుల్లోకి సైబర్‌ నేరగాళ్లు చొరబడినట్లు గుర్తించామని యాపిల్‌ పేర్కొంది. ఎప్పుడు, ఎవరిపై ఈ సైబర్‌ దాడులు చోటు చేసుకొంటాయనేది ముందుగా గుర్తించడం కష్టమైనప్పటికీ.. జరుగుతాయని మాత్రం కచ్చితంగా చెప్పగలమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు యూజర్లను అప్రమత్తం చేయటంతో పాటు తగిన జాగ్రత్తలు సూచిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.

2023 అక్టోబర్‌లో భారత్‌లో కొంతమంది ప్రముఖులకు యాపిల్‌ (Apple) పంపిన నోటిఫికేషన్‌ తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అధికారిక మద్దతు ఉన్న సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చని అందులో హెచ్చరించింది. వీటిని అందుకున్న వారిలో విపక్ష నేతలు శశి థరూర్‌, మహువా మొయిత్రా సహా పలువురు మీడియా ప్రముఖులు కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని