Twitter: ట్విటర్‌కు అద్దె కష్టాలు.. వేలానికి ఆఫీస్‌ వస్తువులు..!

ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి ఉంచారు. ఖరీదైన ఫర్నీచర్‌, కంప్యూటర్లు, కిచెన్‌ సామగ్రితోపాటు నీలి రంగులో ఉండే కంపెనీ లోగో ప్రతిమను కూడా వేలానికి ఉంచింది.

Published : 18 Jan 2023 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ను (Twitter) సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు ఆర్థిక కష్టాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయంతో పాటు అనేక చోట్ల అద్దె చెల్లించలేక ట్విటర్‌ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న వస్తువులను వేలానికి పెట్టింది. ట్విటర్‌ ప్రతిమతోపాటు కాఫీ మెషిన్లు, ఫర్నీచర్‌, చివరకు కిచెన్‌ సామగ్రిని కూడా వేలంలో ఉంచింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రియ 27 గంటలపాటు కొనసాగనుంది.

ట్విటర్‌ కేంద్ర కార్యాలయంలోని వస్తువుల వేలాన్ని హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్ట్‌నర్స్‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో అత్యాధునిక డిజైన్లతో కూడిన కార్యాలయ వస్తువులతో పాటు కాఫీ మెషిన్లు, డిజైనర్‌ కుర్చీలు, ఐమ్యాక్‌లు, కిచెన్‌ సామగ్రి, వంద ఎన్‌95 మాస్కుల డబ్బాలు, డెస్కుల వంటి 631 రకాల వస్తువులను వేలంలో పొందుపరిచారు. వీటిలో కంపెనీకి గుర్తుతో ఉన్న నీలి రంగు ట్విటర్‌ ప్రతిమ, ‘@’ రూపంలో ఉన్న కళాకృతులు కూడా వేలంలో ఉండటం గమనార్హం. ఇందులో నియాన్‌తో చేసిన కంపెనీ లోగోకు వేలంలో భారీ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

నియాన్‌తో చేసిన కంపెనీ లోగోకు అత్యధిక బిడ్‌లు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దానికి 64 బిడ్‌లు రాగా.. ప్రస్తుతం ధర సుమారు 17వేల డాలర్లు పలుకుతోంది. ఇక సాధారణ ట్విటర్‌ ప్రతిమకు 55బిడ్లు రాగా 16వేల డాలర్లతో సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ‘@’ కళాకృతి 4వేల డాలర్లు పలుకుతోంది. అయితే, ఈ వేలం ట్విటర్‌ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కాదని దాని నిర్వాహకులు చెప్పినప్పటికీ.. ఎందుకు వేలం వేస్తున్నారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.

మరోవైపు అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని హార్ట్‌ఫోర్డ్‌ బిల్డింగ్‌లో కొనసాగుతోన్న ఈ ట్విటర్‌ ప్రధాన కార్యాలయం అద్దెను ట్విటర్‌ చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఇప్పటికే కోర్టులో దావా వేసింది. ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడంతోనే ఇక్కడి స్టేట్‌ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. ఎలాన్‌ మస్క్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అద్దెను చెల్లించడం లేదని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కార్యాలయ వస్తువులు వేలం వేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని