ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ద ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబీ) గురువారం ఎంపిక చేసింది.

Published : 24 Mar 2023 01:34 IST

ఎంపిక చేసిన ఎఫ్‌ఎస్‌ఐబీ

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ద ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబీ) గురువారం ఎంపిక చేసింది. ఎల్‌ఐసీ నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్ల(ఎండీ) నుంచి ఛైర్మన్‌ను ఎంపిక చేశారు. 2023 మార్చి 23  నాటికి ఉన్న పరామితులు, మొత్తం అనుభవం ఆధారంగా నలుగురు ఎండీలను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఐబీ తెలిపింది. ఈ ఏడాది మార్చి 13న ఛైర్మన్‌  ఎమ్‌.ఆర్‌. కుమార్‌ పదవీ కాలం పూర్తి కావడంతో, ఎల్‌ఐసీ ఎండీగా ఉన్న మొహంతి.. తాత్కాలికంగా ఛైర్మన్‌ బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫారసుపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎఫ్‌ఎస్‌ఐబీ ఎంపిక చేయకపోతే, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల తరహాలోనే ఈ ఏడాది జూన్‌ 30కి 60 ఏళ్ల మొహంతి పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. ఎల్‌ఐసీ ఛైర్మన్‌ మాత్రం 62 ఏళ్ల వరకు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని