చిన్నబోయిన షేర్లు

సాధారణంగా చిన్న షేర్లపై చిన్న మదుపర్లు లేదా దేశీయ మదుపర్లే దృష్టి సారిస్తుంటారు. గణాంకాలను చూస్తుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి నష్టాలే మిగిలినట్లు కనిపిస్తోంది.

Published : 31 Mar 2023 01:15 IST

2022-23లో స్మాల్‌ క్యాప్‌ సూచీ 6% క్షీణత
మిడ్‌ క్యాప్‌ సూచీ, సెన్సెక్స్‌ 1% తగ్గాయ్‌

సాధారణంగా చిన్న షేర్లపై చిన్న మదుపర్లు లేదా దేశీయ మదుపర్లే దృష్టి సారిస్తుంటారు. గణాంకాలను చూస్తుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి నష్టాలే మిగిలినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చిన్న షేర్లు డీలాపడటంతో బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ సూచీ  5.73% లేదా 1,616.93 పాయింట్ల మేర కోల్పోయింది. ఇదే సమయంలో మిడ్‌ క్యాప్‌ సూచీ 270.29 పాయింట్లు (1.12 శాతం) నష్టపోగా, బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 608.42 పాయింట్లు (1.03 శాతం) మాత్రమే తగ్గింది.

* మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం.. స్థానిక మదుపర్లు ఎక్కువగా చిన్న షేర్లపై, విదేశీ మదుపర్లు ఎక్కువగా బ్లూచిప్‌ లేదా పెద్ద షేర్లపై ఆసక్తి చూపిస్తుంటారు. అంటే ఈసారి ఎక్కువగా నష్టపోయింది దేశీయ మదుపర్లే అని తెలుస్తోంది.

* అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా మారాయి.

* 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో నిఫ్టీ, సెన్సెక్స్‌లు రెండంకెల ప్రతిఫలాన్ని అందించాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో డీలా పడ్డాయి. సాధారణంగా రెండేళ్లు వరుసగా మార్కెట్లు లాభాల్లో ఉంటే, మూడో ఏడాది లాభాల స్వీకరణ జరుగుతుందనేది ఒక అంచనా.

వడ్డీ రేట్లు పెరిగితే..

ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నాయి. దీంతో చిన్న మదుపర్లు రిస్కుతో కూడిన స్టాక్‌ మార్కెట్‌ కంటే కచ్చితమైన రాబడిని అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపారు. అందుకే చిన్న షేర్లకు గిరాకీ తగ్గిందని ఈక్విటీ అడ్వైజర్‌ మార్కెట్స్‌మోజో ముఖ్య పెట్టుబడుల అధికారి సునీల్‌ దమానియా వెల్లడించారు. వడ్డీ రేట్లు పెరుగుతుంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు తగ్గడాన్ని గతంలోనూ గమనించామని ఆయన పేర్కొన్నారు.

2020-21, 2021-22లో లాభాల పంట

2021-22లో బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ 7,566.32 పాయింట్లు (36.64%) పెరిగింది. మిడ్‌ క్యాప్‌ సూచీ 3,926.66 పాయింట్లు (19.45%) లాభపడింది. సెన్సెక్స్‌ కూడా 9,059.36 పాయింట్లు (18.29%) రాణించింది.

* 2020-21లో బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ 11,040.41 పాయింట్లు (114.89 శాతం), మిడ్‌ క్యాప్‌ సూచీ 9,611.38 పాయింట్లు (90.93%) మేర పెరిగాయి. బీఎస్‌ఈలో 30 షేర్ల సెన్సెక్స్‌ సూచీ 20,040.66 పాయింట్లు (68%) మేర లాభపడింది.

అదానీ గ్రూప్‌ కంపెనీలు డీలా

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌.. అదానీ గ్రూప్‌ కంపెనీలపై జనవరి 24న విడుదల చేసిన నివేదిక కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆ గ్రూప్‌నకు చెందిన 10 నమోదిత కంపెనీలు 140 బిలియన్‌ డాలర్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయాయి. చిన్న మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెట్టుబడులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలోనని ఇప్పటికీ తర్జన భర్జనలు పడుతున్నారు. ఎక్కువగా చిన్న షేర్ల వైపు మొగ్గు చూపే వీరు కొనుగోళ్లు తగ్గించడం కూడా స్మాల్‌ క్యాప్‌ సూచీపై ప్రభావం చూపించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మార్కెట్లు పని చేయలేదు

శ్రీరామ నవమి సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఫారెక్స్‌, మనీ మార్కెట్లు పని చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని