వృద్ధి చెందే కంపెనీల్లో...

గత కొంతకాలంగా మదుపరుల దృష్టిని ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు ఆకర్షిస్తున్నాయి. ఒకే తరగతికి చెందిన షేర్లపై పెట్టుబడికే పరిమితం కాకుండా.. చిన్న, మధ్యస్థాయి, పెద్ద కంపెనీల్లో ఎక్కడ వృద్ధి అవకాశాలు అధికంగా ఉంటే ఆ తరగతికి చెందిన షేర్లలో పెట్టుబడి

Published : 05 Aug 2022 00:47 IST

గత కొంతకాలంగా మదుపరుల దృష్టిని ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు ఆకర్షిస్తున్నాయి. ఒకే తరగతికి చెందిన షేర్లపై పెట్టుబడికే పరిమితం కాకుండా.. చిన్న, మధ్యస్థాయి, పెద్ద కంపెనీల్లో ఎక్కడ వృద్ధి అవకాశాలు అధికంగా ఉంటే ఆ తరగతికి చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టి అధిక ప్రతిఫలాన్ని ఆర్జించే అవకాశం ఉండటం ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లకు ఉన్న ప్రత్యేకత. దీన్ని పరిగణనలోకి తీసుకొని బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘బరోడా బీఎన్‌పీ పారిబస్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌’ను ఆవిష్కరించింది. దీన్ని ఎన్‌ఎఫ్‌ఓ నేటితో ముగియనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫథకం. కాబట్టి, తర్వాతా పెట్టుబడికి అవకాశం ఉంటుంది. దీనికి ఫండ్‌ మేనేజర్‌గా సంజయ్‌ చావ్లా వ్యవహరిస్తారు. ఈ పథకం కింద ఎంపిక చేసుకున్న రంగాలకు చెందిన కంపెనీలను ‘టాప్‌-డౌన్‌’ విధానంలో ఖరారు చేసి, పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. ఆకర్షణీయమైన వ్యాపారం, ఆర్థికంగా బలంగా ఉండటం, మేనేజ్‌మెంట్‌ సత్తా, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు.. వంటి వివిధ అంశాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీర్ఘకాలిక మదుపరులు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.

ఐటీ సంస్థల్లో పెట్టుబడి...
నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఉన్న షేర్లలో మదుపు చేయడం ద్వారా మదుపరులకు లాభాలు ఆర్జించే వ్యూహంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మూచ్యువల్‌ ఫండ్‌, ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఫండ్‌’ను రూపొందించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 11. కనీస పెట్టుబడి రూ.1,000. మనదేశంలో డిజిటల్‌ ఎకానమీ, 2025 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోబోతోందని, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్‌ వంటి అధునాతన ఐటీ సాంకేతిక పరిజ్ఞానం వల్ల, పెద్దఎత్తున ప్రాజెక్టులు లభించి ఐటీ కంపెనీలు వృద్ధి బాటలో ముందుకు సాగుతాయని ఐసీఐసీఐ ఏఎంసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొన్నేళ్లలో నిఫ్టీ ఐటీ టీఆర్‌ఐ 18.4 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. నిఫ్టీ 50 నమోదు చేసిన 12.9 శాతం కంటే ఇది అధికం. ఈ ఆకర్షణీయమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఈ పథకానికి కైజాడ్‌ ఎగ్లిమ్‌, నిషిత్‌ పటేల్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఐటీ రంగం వృద్ధిపై విశ్వాసం ఉన్న దీర్ఘకాలిక మదుపరులు దీన్ని పరిశీలించవచ్చు.

వెండిపై పరోక్షంగా...
వెండిపై పరోక్షంగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. అదే డీఎస్‌పీ సిల్వర్‌ ఈటీఎఫ్‌. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 12తో ముగియనుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం కింద సమీకరించిన నిధులతో వెండి, వెండిలో పెట్టుబడి పెట్టే పత్రాలను కొనుగోలు చేస్తారు. వెండి ధర పెరిగితే ఆ మేరకు మదుపరులకు లాభాలు కనిపిస్తాయి. ఈటీఎఫ్‌ యూనిట్‌ ధర, మార్కెట్లో వెండి ధరకు సమానంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, పవర్‌, ఫార్మాసూటికల్‌ పరిశ్రమల్లో వెండి వినియోగం ఎంతో ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా లభించే వెండిలో దాదాపు 50 శాతం పారిశ్రామిక అవసరాలకే వెచ్చిస్తున్నారు. మదుపరులు తమ పెట్టుబడులన్నింటినీ ఈక్విటీ మార్కెట్‌కు పరిమితం చేయకుండా, కొంతమేరకు వైవిధ్యం ఉండాలి అనుకుంటే డీఎస్‌పీ సిల్వర్‌ ఈటీఎఫ్‌ను పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని