Microsoft: విండోస్‌ 7, 8 ఓఎస్‌లు వాడుతున్నారా..? అయితే అప్‌గ్రేడ్ తప్పనిసరి!

యూజర్లకు కొత్త సాంకేతికతను, మెరుగైన భద్రతను అందిచాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత తరం ఓఎస్‌లు విండోస్ 7, 8లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Published : 04 Jan 2023 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత విండోస్‌ ఓఎస్‌ వెర్షన్‌లకు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విండోస్‌ 7, విండోస్‌ 8 ఓఎస్‌లను ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ ఓఎస్‌ విండోస్‌ 10కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. జనవరి 10 తర్వాత ఓఎస్‌లకు సంబంధించి మైక్రోసాఫ్ట్ విడుదల చేసే టెక్నికల్‌, సెక్యూరిటీ అప్‌డేట్‌లు విండోస్‌7, 8 వెర్షన్‌లలో అప్‌డేట్‌ కావని తెలిపింది. దీంతోపాటు ఫిబ్రవరి 7 నుంచి మైక్రోసాప్ట్‌ ఎడ్జ్‌ 109 బ్రౌజర్‌, గూగుల్ క్రోమ్‌లు కూడా ఈ ఓఎస్‌లలో పనిచేయవని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. యూజర్లకు కొత్త సాంకేతికతను, మెరుగైన భద్రతను అందించాలనే ఉద్దేశంతో వాటికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 

‘‘ప్రస్తుతం మనం ఉపయోగించే కంప్యూటర్లు ఎంతో వేగవంతమైనవి, శక్తివంతమైనవి. వాటిలో చాలా వరకు విండోస్‌ 11 ఓఎస్‌తోనే వస్తున్నాయి. పాత కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌ ఫీచర్లు విండోస్‌ 10, 11 ఓఎస్‌లను సపోర్ట్ చేయవు. కాబట్టి యూజర్లు తప్పక తమ కంప్యూటర్లతో పాటు ఓఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది’’ అని మైక్రోసాప్ట్‌ సపోర్ట్ పేజీలో పేర్కొంది. 

మైక్రోసాఫ్ట్‌ 2021లో విండోస్‌ 11 ఓఎస్‌ను విడుదల చేసింది. యూజర్లు ఈ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాలని అప్పట్లో సూచించింది. అయితే, ఈ ఓఎస్‌ను ఉపయోగించేందుకు 64 బిట్‌ సిస్టమ్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 1జీహెచ్‌జెడ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ వంటి కనీస ఫీచర్లతో కంప్యూటర్‌ పనిచేస్తుండాలని తెలిపింది.

ప్రస్తుతం విండోస్‌ 7, విండోస్‌8.1 ఉపయోగిస్తున్న యూజర్లు విండోస్‌ 10కు  అప్‌డేట్ చేసుకునేందుకు  కంప్యూటర్‌ సెట్టింగ్స్‌లో  అప్‌డేట్స్‌లోకి వెళితే విండోస్‌ అప్‌డేట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి విండోస్‌ 10 అప్‌డేట్ చేసుకోవచ్చు. తర్వాత సిస్టమ్‌ను రీస్టార్ట్ చేయాలి. తర్వాత మీ ఓఎస్‌ విండోస్ 10కి అప్‌డేట్ అయినట్లు చూపిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని