Mobile phones: పదేళ్లలో 21 రెట్లు పెరిగిన మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ

Mobile phones: 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఫోన్ల తయారీ విలువ 2023-24 నాటికి రూ.4,10,000 కోట్లకు చేరినట్లు ఐసీఈఏ తెలిపింది.

Published : 10 Mar 2024 20:41 IST

దిల్లీ: భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ పదేళ్లలో 21 రెట్లు పెరిగి రూ.4.1 లక్షల కోట్లకు చేరినట్లు ‘ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA)’ వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం (PLI) వంటి ప్రభుత్వ విధానాలు.. దేశీయంగా తయారీ చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు ఉపకరించాయని తెలిపింది.

దేశీయ గిరాకీలో 97 శాతం మొబైల్‌ ఫోన్లు స్థానికంగానే తయారవుతున్నాయని ఐసీఈఏ తెలిపింది. 2023-24లో ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిలో 30 శాతం ఎగుమతి కోసమేనని వెల్లడించింది. 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఫోన్ల తయారీ విలువ 2023-24 నాటికి రూ.4,10,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2015 ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ ఫోన్ల ఎగుమతుల విలువ రూ.1,556 కోట్లు మాత్రమేనని పేర్కొంది. 2023-24 చివరకు ఆ విలువ రూ.1.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అంటే దశాబ్ద కాలంలో 7,500 శాతం పెరిగినట్లని వివరించింది. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెరగడంలో యాపిల్‌, శాంసంగ్‌ కీలక పాత్ర పోషించాయని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఇటలీ, పశ్చిమాసియా, ఉత్తర, దక్షిణ అమెరికా మార్కెట్లకు అధికంగా ఎగుమతి అవుతున్నట్లు వెల్లడించింది. భారత్‌ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాలో మొబైల్‌ ఫోన్లు ఐదో స్థానానికి చేరాయని పేర్కొంది.

2017 మేలో మొబైల్ ఫోన్ల దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘దశలవారీ తయారీ కార్యక్రమం (PMP)’ని ప్రకటించింది. దీంతో భారత్‌లో ఒక బలమైన స్వదేశీ మొబైల్ తయారీ వ్యవస్థ నిర్మితమైంది. 2014లో కేవలం రెండు మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ప్రపంచంలో భారత్‌ రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా అవతరించింది. మరోవైపు పీఎల్‌ఐ వల్ల ఎలక్ట్రానిక్స్‌ తయారీకి భారత్‌ ప్రధాన కేంద్రంగా మారింది. ఈ పథకం వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్‌, రైజింగ్‌ స్టార్‌, విస్ట్రాన్‌ వంటి కంపెనీలు భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. మరోవైపు శాంసంగ్‌ నోయిడాలో రెండో అతిపెద్ద తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని