logo

సంక్షిప్త వార్తలు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో కొత్తగా ఏర్పాటైన అంతిరెడ్డిగూడ పంచాయతీకి 8 వారాల్లోగా ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 31 Jan 2023 06:09 IST

అంతిరెడ్డిగూడ పంచాయతీకి ఎన్నిక నిర్వహించండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో కొత్తగా ఏర్పాటైన అంతిరెడ్డిగూడ పంచాయతీకి 8 వారాల్లోగా ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2020లో కొత్తగా ఏర్పాటైన అంతిరెడ్డిగూడ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ అదే గ్రామానికి చెందిన అంజి యాదవ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొన్నం అశోక్‌గౌడ్‌ వాదనలు వినిపిస్తూ కొత్తగా ఏర్పాటైన పంచాయతీకి నిబంధనల ప్రకారం 6 నెలల్లో సర్పంచి ఎన్నిక నిమిత్తం ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కొత్తగా 8 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మూసివేసింది.


పన్ను ఆదాయం పెంపునకు కొత్త సాఫ్ట్‌వేర్‌

‘పీటీఐఎంఎస్‌’ విధానానికి జీహెచ్‌ఎంసీ టెండరు

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వీయ మదింపు(సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌) ద్వారా వచ్చే దరఖాస్తులు పరిశీలించి, నకిలీ వివరాలు గుర్తించే కొత్త సాఫ్ట్‌వేర్‌పై దృష్టిపెట్టింది. విస్తీర్ణాన్ని తక్కువగా పేర్కొనడం, వాణిజ్య భవనాలను నివాసాలుగా చెప్పి తక్కువ పన్ను పొందుతున్న కేటుగాళ్లను కనిపెట్టేందుకు ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇంటెలిజెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను(పీటీఐఎంఎస్‌) అందుబాటులోకి తేవాలని జీహెచ్‌ఎంసీ టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చింది. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఇప్పటి వరకు జారీ అయిన ఇంటి నంబర్లు, ఎప్పట్నుంచో ఆస్తిపన్ను చెల్లిసున్న భవనాలను సైతం పీటీఐఎంఎస్‌ ద్వారా పరిశీలించనున్నట్లు సమాచారం. కొత్త విధానాన్ని 36 నెలలపాటు ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. స్వీయ మదింపులో నోటరీ పత్రాలతో ఇంటి నంబరు తీసుకున్న 60వేల నిర్మాణాలపై విచారణ చేపట్టామని, ఇప్పటి వరకు 10వేల దరఖాస్తులను పరిశీలించి 4వేల ఇంటి నంబర్లు రద్దు చేశామని అధికారులు తెలిపారు.


‘నుమాయిష్‌’లో పిల్లలకు ఉచిత ప్రవేశం నేడు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: నుమాయిష్‌లో ‘చిల్డ్రన్స్‌ డే’ సందర్భంగా మంగళవారం స్కూలు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్‌మార్గం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు వారి స్కూలు ముద్రణతో కూడిన పాస్‌లను విద్యార్థులకిచ్చి పంపించాలని సూచించారు. నుమాయిష్‌లో ఏటా జనవరి 31న చిల్డ్రన్స్‌ డే నిర్వహిస్తుండటం తెలిసిందే. మంగళవారం స్కూలు పిల్లలకు ఉచిత ప్రవేశంతోపాటు పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.


బీటెక్‌ చదువుతూనే బీబీఏ-డీఏ కోర్సు

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: బీటెక్‌, బీఫార్మసీ చదువుతూనే బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ డేటా ఎనలిటిక్స్‌ (బీబీఏ-డీఏ) కోర్సు చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. వర్సిటీ గుర్తింపు పొందిన కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సోమవారం ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కొత్త కోర్సుల విధివిధానాలను వివరించారు. ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచి ప్రారంభించిన మూడేళ్ల ఈ కోర్సును ఆసక్తి కలిగిన బీటెక్‌, బీఫార్మసీ 1, 2, 3వ సంవత్సరం విద్యార్థులు చేయవచ్చన్నారు. రెగ్యులర్‌గా చదువుతున్న బీటెక్‌, బీఫార్మసీల కోర్సులకు అంతరాయం లేకుండా పార్ట్‌టైం విధానంలో ఫ్యాకల్టీ ప్రత్యేక షెడ్యూల్‌తో బీబీఏ-డీఏ కోర్సు తరగతులు నిర్వహిస్తారన్నారు. దీంతో ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తిచేసుకునే సౌలభ్యం విద్యార్థులకు కలుగుతుందన్నారు. 2020 నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీలో భాగంగా ఈ కొత్త కోర్సును కొత్త విధానంతో ప్రవేశపెట్టామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని