త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Updated : 22 Nov 2023 12:34 IST

చెన్నై: హీరోయిన్‌ త్రిషపై (Trisha) నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిషపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తాజాగా ఈ విషయంపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan).. త్రిషకు క్షమాపణలు చెప్పనని అన్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా?’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మన్సూర్‌ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్ సంఘం‌) అతడిని పాక్షికంగా నిషేధించింది. సోషల్‌మీడియాలో త్రిషకు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా చిరంజీవి ఆమెకు మద్దతుగా ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ఇలాంటి పరిస్థితులు ఏ ఆడపిల్ల ఎదుర్కొన్నా తాను అండగా ఉంటానన్నారు.

అల్లు అర్జున్‌పై సీరత్‌ కపూర్‌ ప్రశంసలు.. ఆ సాంగ్‌లో కనిపించనుందా?

కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని భావించినట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై  త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే పరిశ్రమలోని అందరికీ చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. అతడితో నటించే అవకాశం రాకపోవడం సంతోషకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని