Jagapathi babu: ఆ సమయంలో ప్రభాస్‌ ఓదార్పునిచ్చాడు: జగపతిబాబు

నటుడు జగపతిబాబు (Jagapathi babu) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాను డిప్రెషన్‌లో ఉంటే ప్రభాస్‌ ఓదార్పునిచ్చినట్లు తెలిపారు.

Published : 19 Sep 2023 01:36 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు జగపతిబాబు (Jagapathi babu) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్‌ హీరోల సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషిస్తూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి కుటుంబంపై, హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో తాను డిప్రెషన్‌లో ఉండి ప్రభాస్‌కు ఫోన్‌ చేస్తే ఎంతో ఓదార్పునిచ్చాడని తెలిపారు.

రాజమౌళి కుటుంబం గురించి మాట్లాడిన జగపతిబాబు.. వాళ్ల నుంచి 20శాతం నేర్చుకున్నా చాలన్నారు. ‘‘ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించినా రాజమౌళి ఫ్యామిలీలో ఎవ్వరికీ గర్వం ఉండదు. ఒక్కరో ఇద్దరో కాదు ఆ కుటుంబంలోని వారంతా అలానే ఉంటారు. అందరినీ ప్రేమగా ఆదరిస్తారు. హీరో ప్రభాస్‌ కూడా అదే తరహా మనిషి. అతడికి ఇవ్వడమే కానీ.. అడగడం తెలీదు. ఎవరే సాయం కావాలన్నా చేస్తాడు. నాకు వ్యక్తిగతంగా ప్రభాస్‌తో ఓ అనుభవం ఉంది. నేను ఓసారి డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాలని అడిగా. తను జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్‌.. నేనున్నా కదా? నీ ప్రాబ్లమ్‌ చెప్పు.. నేను తీరుస్తా’ అని ధైర్యం చెప్పాడు. అంతే కాదు అక్కడి నుంచి వచ్చాక నన్ను కలిశాడు. నా కంటే చిన్నవాడైనా ఎంతో గొప్ప హృదయం తనది. ఆ సమయంలో చిన్న ఓదార్పు నాకెంతో ధైర్యాన్నిచ్చింది’’ అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. 

వినాయక చవితికి వినోదాన్ని పంచిన కొత్త పోస్టర్లు..

ఇక అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడం గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం అల్లు అర్జున్‌ను చూసినప్పుడే తనలో ఎంతో పట్టుదల కనిపించిందని అన్నారు. సినిమాలపై బన్నీకి (Allu Arjun) ఎంతో తపన ఉందని ఆయన చెప్పారు. తనని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక ఇటీవలే ‘రుద్రంగి’ (Rudrangi) సినిమాతో పలకరించిన జగపతిబాబు ప్రస్తుతం ‘సలార్‌’, ‘గుంటూరు కారం’, ‘పుష్ప-2’ సినిమాల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని