Budget 2023: రైల్వేకు భారీ కేటాయింపులు.. ఆ రైళ్లలో మెరుగైన సదుపాయాలు

బడ్జెట్‌లో ఎన్నడూ లేని రీతిలో రైల్వేకు భారీ కేటాయింపులు జరిపారు. గత బడ్జెట్‌లో రూ.1.40 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.2.40 లక్షల కోట్లకు పెంచారు.

Updated : 01 Feb 2023 16:10 IST

దిల్లీ: బడ్జెట్‌లో రైల్వేకు (Indian Railway) ఈ సారి కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. గత బడ్జెట్‌లో రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఏకంగా రూ.2.40 లక్షలు కోట్లు (Budget 2023) కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 2013-14లో జరిపిన కేటాయింపులతో పోలిస్తే 9 రెట్లు అధికమని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో కొత్త రైళ్ల ప్రస్తావన లేనప్పటికీ.. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు వెచ్చించనున్నారు.

రాజధాని, శతాబ్ది, హంసఫర్‌, తేజస్‌ వంటి ప్రీమియం రైళ్లలో సౌకర్యాల మెరుగుకు ఈ సారి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రయాణికులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించేందుకు దాదాపు వెయ్యికి పైగా కోచ్‌లను ఆధునికీకరించనున్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల కోసం వేగానికి అనుగుణంగా ట్రాకుల సామర్థ్యాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో రూ.17,296 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్నప్పటికీ.. ట్రాకుల సామర్థ్యం సరిగా లేకపోవడంతో వందే భారత్‌ రైళ్ల వేగం ప్రస్తుతం 130 కిలోమీటర్లుగా ఉంది.

బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల వంటి వాటి రవాణా కోసం 100 క్లిష్టమైన రవాణా మౌలిక ప్రాజెక్టులు గుర్తించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తిస్తూ వీటికి మొత్తం రూ.75వేల కోట్లు కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఇందులో రూ.15వేల కోట్లు ప్రైవేట్‌ మార్గాల నుంచి రానున్నాయని చెప్పారు. బడ్జెట్‌లో ప్రకటించిన నిధులను రైల్వే ట్రాకులు, వ్యాగన్లు, విద్యుదీకరణ, సిగ్నలింగ్‌, స్టేషన్ల సౌకర్యాల కల్పన, ప్రయాణికల భద్రత కోసం వినియోగించనున్నారు.

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్దపీట వేస్తోంది. ఉడాన్‌ స్కీమ్‌ ఇందులో భాగమే. దీనికి కొనసాగింపుగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌ ఎరోడ్రోమ్స్‌, అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌ను మెరుగు పరచనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఉడాన్‌ స్కీమ్‌ కింద గడిచిన ఆరేళ్లలో 1.15 కోట్ల మంది ప్రయాణాలు చేశారన్నారు. 2014లో 74గా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 147కు పెరిగిందని చెప్పారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరలించిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు