Mercedes- Benz: 2023లో 10 కొత్త బెంజ్‌ కార్లు.. ధర రూ.1 కోటి పైనే!

Mercedes- Benz : సిక్స్‌ పిల్లర్‌ వ్యూహంలో భాగంగా మెర్సిడెస్‌ బెంజ్‌ ఈ ఏడాది 10 కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 

Published : 06 Jan 2023 18:19 IST

దిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌- బెంజ్‌ (Mercedes-Benz) 2023లో భారత్‌లో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు ఇవన్నీ రూ. 1 కోటి కంటే ఎక్కువ ధరలోనే ఉంటాయని పేర్కొంది. గతేడాది ఈ సెగ్మెంట్‌లో కార్ల విక్రయాలు 69 శాతం పెరిగినట్లు తెలిపింది. 2022లో బెంజ్‌ 15,822 వాహనాలను విక్రయించింది. వీటిలో 3,500 కార్లు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్నవే.

ఈ క్యాలెండర్‌ ఏడాది విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెర్సిడెస్‌- బెంజ్‌ (Mercedes-Benz) ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. గత ఏడాదిలో తమ ‘టాప్‌-ఎండ్‌ వెహికల్‌ (TEV)’ సెగ్మెంట్‌ విక్రయాల్లో అధిక వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. రూ. 1 కోటి (ఎక్స్‌- షోరూం) కంటే ఎక్కువ ధర పలికే ఎస్‌- క్లాస్‌ మే బ్యాచ్‌, జీఎల్‌ఎస్‌ మే బ్యాచ్‌తో పాటు టాప్‌ ఏఎంజీలు, ఎస్‌-క్లాస్‌, జీఎల్‌ఎస్‌ ఎస్‌యూవీలు టాప్‌- ఎండ్‌ వాహనాల విభాగంలోకి వస్తాయి. మెర్సిడెస్‌- బెంజ్‌ (Mercedes-Benz) ఇండియా బాధ్యతల్ని అయ్యర్‌ ఇటీవలే చేపట్టారు. ఈ హోదాకు చేరిన తొలి భారతీయుడు ఆయనే.

కంపెనీ మొత్తం విక్రయాల్లో టాప్‌- ఎండ్‌ వాహనాల వాటా 22 శాతానికి చేరినట్లు అయ్యర్‌ తెలిపారు. కొవిడ్‌ పూర్వపు విక్రయాలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని వెల్లడించారు. కంపెనీ ‘‘six pillar’’ వ్యూహంలో భాగంగానే టీఈవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్‌ స్టోర్‌ విక్రయాలను సైతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ఏడాది ఆన్‌లైన్‌ వేదిక ద్వారానే 2,000 కార్లను విక్రయించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్తు వాహనాల పోర్ట్‌ఫోలియోను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు అయ్యర్‌ తెలిపారు. ఇప్పటికే ఈక్యూసీ, ఈక్యూబీ, ఈక్యూఎస్‌ 53 ఏంఎంజీ, ఈక్యూఎస్‌ 580 ఈవీ మోడళ్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని